పలాస: సోంపేట మండలం గొల్లూరు గ్రామానికి చెందిన శివకుమార్ను కఠినంగా శిక్షించాలని, అతని కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు తగిన న్యాయం చేయాలని పౌరహక్కుల సంఘం, ఇతర ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గొల్లూరులో జరిగిన దారుణ ఘటనపై అంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాల నాయకుల నిజ నిర్ధారణ కమిటీ మంగళవారం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శివకుమార్ ఇంట్లో ఉన్న ఊర్వశిని ఆస్తి తగాదాల నేపథ్యంలో కక్ష పెంచుకొని అతి దారుణంగా హత్య చేసి పారిపోయాడన్నారు. అందువలన నిందుతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. అలాగే అనాథలైన చిన్నారులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్తిరి దానేసు, జిల్లా కమిటీ నాయకులు సోమనాథం, వైకుంఠరావు, జోగారావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల ధర్మారావు, పుచ్చ దుర్యోధనరావు, సాలిన వీరాస్వామి, బొడ్డు నాగమణి, సరస్వతి, దాసరి శ్రీరాములు, వాసుదేవరావు, బొడ్డు జగన్ తదితరులు పాల్గొన్నారు.


