‘యురేకా సైన్స్ ఎక్స్పో’ విజయవంతం చేయండి
శ్రీకాకుళం: త్వరలో అన్ని జిల్లాల్లోనూ జరగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల వినూత్న పోటీలు (యురేకా సైన్స్ ఎక్స్పో– 2026)ను విజయవంతం చేయాలని డీఈఓ ఏ.రవిబాబు, పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంజీవరావు, జిల్లా కార్యదర్శి పూజారి గోవిందరావు మాట్లాడుతూ ప్రయోగాలతో విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెరుగుతుందన్నారు. జేవీవీ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ ఇన్నోవేషన్– టెక్నాలజీ,పర్యావరణం– వ్యవసాయ రంగం, అపోహలు –శాసీ్త్రయ వివరణ అనే అంశాలపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 8,9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, టెక్కలి ఉపవిద్యాశాఖాధికారులు ఆర్.విజయ్కుమారి, పి.విలియం, జిల్లా పరీక్ష విభాగాధిపతి చంద్రభూషణ్, డీసీఈబీ సెక్రటరీ సంజీవరావు పాల్గొన్నారు.


