వందేమాతరం.. అందాం అందరం
నరసన్నపేట: సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ సైకిల్ యాత్ర గురువారం సాయంత్రం నరసన్నపేటకు చేరుకుంది. మండల సరిహద్దు గ్రామం తామరాపల్లి వద్ద ఘన స్వాగతం పలికారు. వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ సీఐఎస్ఎఫ్ కోస్టల్ బృందాలు సైకిల్ యాత్రను పశ్చిమ బెంగాల్లో జనవరి 28న ప్రారంభించాయి. ఈ ర్యాలీ కేరళ వరకు సాగుతుంది. అందు లో భాగంగా గురువారం నరసన్నపేటకు వచ్చిన ర్యాలీకి పారామిలటరీ మాజీ సైనికులు, పోలీసులు, ఎన్సీసీ కేడెట్లు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక పైడితల్లి అమ్మవారి ఆలయం రోడ్డు లో ఉన్న పారామిలటరీ మాజీ సైనికుల కార్యాలయం వద్ద భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సౌత్ జోన్ డీఐజీ ఎం.జీ.రాఘవేంద్రకుమార్ మాట్లాడుతూ వందేమాతర గీతం స్వాతంత్రోద్యమ కాలంలో దేశ సమైక్యతను చాటిందని అన్నారు. ఈ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఎస్ఎఫ్ జవాన్లతో సైకిల్ ర్యాలీ తలపెట్టామన్నారు. 25 రోజుల పాటు తొమ్మిది రాష్ట్రాలను కవర్ చేస్తూ 6533 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తామన్నారు. నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు కల్పించారు. కార్యక్రమంలో ఐసీఎల్ కమాండర్ డి.జితేంద్ర బాబు, డిప్యూటీ కమాండర్ అవినాష్కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ కుమార్ తో పాటు పలువురు సీఐఎస్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు.


