వ్యాయామ విద్యాభివృద్ధికి కృషి చేయాలి
ఇచ్ఛాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులంతా వ్యాయామ విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(ఐపీఈ) ఆంధ్రప్రదేశ్ ఎండీ మహబూబ్బాషా అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వ్యాయామ విద్యపై పర్యవేక్షణ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులంతా సమయపాలన పాటించడంతో పాటు నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగున్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పి.తవిటయ్య, జోన్–1 వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.పద్మనాభం రెడ్డి, పి.గజేంద్ర, హెచ్ఎంలు కె.సూర్యారావు, కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


