ఆకట్టుకున్న అవధానాలు
నరసన్నపేట: మండలంలోని ఉర్లాంలో బుధవారం నిర్వహించిన త్రిగళ అష్టావధానం ఆకట్టుకుంది. సుసరాపు చంద్రశేఖర శర్మ, రంప సాయికుమార్ శర్మ, ఎన్.జయలక్ష్మిలు తెలుగు, ఆంధ్రం, సంస్కృతం భాషల్లో త్రిగళ అవధానం చేశారు. మండపాటి మహేశ్వరి అష్టావధానం నిర్వహించారు. 212 మంది కవులు, పండితులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు అవధాన కార్యక్రమాలు జరిగాయి. సంధించిన ప్రశ్నలను అవధానులు సమయస్ఫూర్తితో వివరించడం ఆకట్టుకుంది. అవధాన సభా అధ్యక్షుడు బంకుపల్లె రమేష్ శర్మ మాట్లాడుతూ ఉర్లాం సంస్థానం కళలకు పెట్టింది పేరని, దానిని గుర్తు చేసుకొని ఈ అవధాన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సత్యవరాగ్రహారానికి చెందిన మారుతీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధి మావుడూరి జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


