ప్రాణం పోసిన రిమ్స్ వైద్యులు
శ్రీకాకుళం: నగరంలో రిమ్స్ సర్వజన ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో ఇద్దరు రోగులకు అత్యంత క్లిష్టమైన చికిత్స చేసి వైద్యులు ప్రాణం పోశారు. వివరాల్లోకి వెళ్తే.. వనజ సాయిశ్రీ అనే 22 ఏళ్ల మహిళ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని సీహెచ్సీలో ప్రసవం చేయించుకుంది. అనంతరం గత నెల జనవరి 27వ తేదీన వేకువజామున 5 గంటలకు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తీవ్ర రక్తస్రావంతో వచ్చింది. అప్పటికే డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ ప్రియ రోగిని పరీక్షించారు. ప్రసవానంతరం ఆమెకు గర్భసంచి సైతం బయటకు వచ్చినట్లు గుర్తించారు. దీంతో రోగి పరిస్థితిని ఇన్చార్జి ఆర్.పద్మజ, అసోసియేట్ ప్రొఫెసర్ సురేష్ కుమార్లకు తెలియజేశారు. అనంతరం వైద్యులంతా పరిశీలించి నాణ్యమైన వైద్యాన్ని అందించారు. దీంతో వనజ సాయిశ్రీ ప్రస్తుతం కోలుకున్నారు. అలాగే హెచ్వోడీ డాక్టర్ డి.పార్వతి నేతృత్వంలో మరో మహిళకు చికిత్స అందజేసి ప్రాణాలు కాపాడారు. నందిగామ మండలంలోని చిన్న గురువూరుకు చెందిన జగదీశ్వరి అనే మహిళకు టెక్కలి ఆస్పత్రిలో ప్రసవం అయింది. అయితే ఆమెకు తీవ్ర రక్తస్రావం జరగడంతో శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆక్సిజన్ అందిస్తూ 20 మంది వైద్యులు 6 గంటల పాటు శ్రమించి చికిత్స అందించడంతో కోలుకుంది. దీంతో ప్రసూతి విభాగం వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్, ఆర్ఎంవో డాక్టర్ సుభాషిణి, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ శ్రీదేవిలు అభినందించారు


