పిచ్చికుక్క స్వైర విహారం
● పలువురిపై దాడి
టెక్కలి రూరల్: మండలంలోని నర్శింగపల్లి, కిట్టాలపాడు, ముఖలింగాపురం గ్రామాల్లో బుధవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ కనిపించిన వారిపై దాడికి పాల్పడింది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం ఉదయం కిట్టాలపాడు గ్రామానికి చెందిన మోద అప్పారావు అనే వ్యక్తి గ్రామంలో తిరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న పిచ్చికుక్క అతడి కాలిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. అదే కుక్క నర్సింగపల్లి గ్రామం వైపుగా వెళ్తూ అక్కడ సైతం సింగుపురం పాపారావు, రట్టి లక్ష్మణరావు, నాగవరపు మణికంఠతో పాటు మరికొంత మందిపై దాడి చేసింది. అలాగే ముఖలింగాపురం గ్రామంలో సైతం కొంతమందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. కుక్కకాటుకి గాయపడిన వారిలో 9 మంది వరకు టెక్కలి జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా మంగళవారం సైతం కొల్లివలస గ్రామంలో కూడా ఇదే పిచ్చికుక్క కొంత మందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఈ కుక్క ఇంక ఎంతమందిపై దాడి చేస్తుందోనని బయపడిన గ్రామస్తులు హతమార్చినట్లు తెలుస్తోంది.
పిచ్చికుక్క స్వైర విహారం


