ప్రత్యేక రోజుల్లో అదనం..
అంబేడ్కర్ జయంతి, అంబేడ్కర్ వర్ధంతి, గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి, జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలు అని, పుడ్ కమిషన్ పర్యటన కోసమని, బీసీ కమిషన్ ఉన్నతాధికారులు వచ్చారని, సంబంధిత ఉన్నతాధికారులు వచ్చారని.. ఇలా పలు ప్రత్యేక కార్యక్రమాల పేరుతో సంబంధిత జిల్లా అధికారుల వరకు వసతి గృహాల అధికారుల నుంచి వసూళ్లకు తెగబడుతున్నారు. సహాయ అధికారి కార్యాలయం నిర్వహణ కోసమని రూ.500, జిల్లా అధికారి కార్యాలయం నిర్వహణ కోసమని రూ.500 చొప్పున అదనంగా ప్రతీ వసతి గృహం నుంచి ముట్టజెప్పాలి. ప్రతి డివిజన్లో కలెక్షన్ కింగ్లను పెట్టుకున్నారు. వీరు వ్యక్తిగతంగా ముడుపులు ఇవ్వనవసరం లేదు. కలెక్షన్ చేసి అధికారులకు ఇవ్వడమే వారి పని. ఒకవేళ కలెక్షన్ ఇవ్వని వారు ఎవరైనా ఉన్నా..ఆలస్యం చేసినా వారిపైన జిల్లా అధికారులకు లేనిపోనివి చెప్పి వారిపై ప్రత్యేక తనిఖీ జరిపి వేధిస్తుంటారు.
● విద్యార్థుల పేరుతో అక్రమ వసూళ్లు
● చెలరేగిపోతున్న సంక్షేమ శాఖ అధికారులు
● ఒక్కొక్క విద్యార్థి పేరున రోజుకు
రూ.5 చొప్పున ముడుపులు
● అడ్డగోలు నిర్వహణతో ముడుపులు
ముట్టజెబుతున్న వార్డెన్లు
● పలుచోట్ల విద్యార్థుల్లేకుండానే వసతిగృహాల నిర్వహణ
● తీర ప్రాంత వసతి గృహాల్లో పరిస్థితి
మరింత అధ్వానం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడతారో లేదో అనవసరం. వారి ఆలనా పాలనా చూసుకుంటారో లేదో పట్టించుకోరు. సంబంధిత అధికారులకు కావల్సినదంతా ముడుపులే. విద్యార్థికింత చొప్పున ఇచ్చేస్తే చాలు వసతి గృహాలు ఎలా ఉన్నా విద్యార్థులు ఏమైపోయినా పర్వాలేదు. జిల్లాలోని పలు సంక్షేమ వసతిగృహాల్లో జరుగుతున్న అవినీతి బాగోతం చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క విద్యార్థికి రోజుకి రూ.5 చొప్పున, మరికొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క విద్యార్థికి నెలకి రూ.35 చొప్పున ముడుపులు ఇస్తే చాలు ఆ వసతి గృహాలపై పర్యవేక్షణ ఉండదు. సంబంధిత సంక్షేమాధికారుల జోలికి ఏ ఒక్కరూ వెళ్లరు. జిల్లాలో ఇదొక అనవాయితీగా నడుస్తోంది. అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందితో వసూళ్ల పర్వానికి తెరతీశారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు అడ్డగోలు సంపాదనతో అధికారులకు వసతి గృహాల అధికారులు కూడా ముడుపులు ఇస్తున్నారు.
తీర ప్రాంతంలో స్వాహా..
జిల్లాలో అనేక రకాలుగా వసతి గృహాల నుంచి సంబంధిత అధికారులు వసూళ్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల సబార్డినేట్లను కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టగా, మరికొన్ని చోట్ల కొందరు వసతి గృహ సంక్షేమ అధికారులను కలెక్షన్ కింగ్లను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతంలోని హాస్టళ్లలో పిల్లలు ఉండటం లేదు. అక్కడ కనీసం వసతి గృహాల నిర్వహణ ఉండదు. విద్యార్థులంతా ఇంట దగ్గరే ఉంటారు. వారి ఇంటికి ప్రతిరోజు వెళ్లి ఫేస్ రికగ్నేషన్ స్కాన్(ఎఫ్ఆర్ఎస్) చేస్తారు. వారంతా వసతి గృహంలోనే భోజనం చేస్తున్నట్టుగా రికార్డుల్లో పేర్కొని డైట్ బిల్లులు, ఇతరత్రా బిల్లులు పెట్టేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో సముద్రతీర ప్రాంతంలోని16 వసతి గృహాల్లో విద్యార్థులు లేకపోయినా.. వారి ఇంటికి వెళ్లి ఎఫ్ఆర్ఎస్ వేయించుకుని బిల్లులను అక్రమంగా డ్రా చేస్తున్నారు. ఇలా వచ్చిన సొమ్మును సంబంధిత అధికారులు పంచుకుంటున్నారు. ఒక్క బీసీ సంక్షేమ వసతి గృహాల్లోనే కాకుండా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్థికి రూ.5 చొప్పున వసూలు
● కొన్నిచోట్ల తక్కువ హాజరుకు బదులు విద్యార్థుల హాజరు ఎక్కువ చూపించి బిల్లులు డ్రా చేస్తున్నారు.
● ఇలా చేసిన ఒక్కొక్క విద్యార్థి పేరున రోజుకి రూ.5, నెలకి రూ.150చొప్పున సంబంధిత అధికారులకు వసతి గృహ సంక్షేమ అధికారులు ముడుపులుగా ఇస్తున్నారు.
● వసతి గృహాలతో సంబంధం ఉన్న అధికారులందరికీ లబ్ధి చేకూరుతుండటంతో అవినీతిపర్వం యథేచ్ఛగా సాగిపోతోంది.
● మరికొన్ని వసతి గృహాల్లో ఒక్కొక్క విద్యార్ధి పేరున నెలకి రూ.35 చొప్పున అధికారులు తీసుకుంటున్నారు.
● ఇందులో సహాయ అధికారులకు రూ.20 చొప్పున, జిల్లా అధికారులకు రూ.15 చొప్పున అందుతోంది.
● జిల్లాలో 81 బీసీ, 31 ఎస్సీ, 19 ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ కలిపి 11,341మంది విద్యార్థులు ఉన్నారు.
● వీరి పేరున ఎంత ముడుపులు ఇస్తున్నారో సంబంధిత వసతి గృహాల అధికారులకు, తీసుకుంటున్న ఉన్నతాధికారులకు తెలియాలి.


