యూరియా కోసం అవస్థలు
నరసన్నపేట: యూరియా కోసం ఖరీఫ్లో అన్నదాత కష్టాలు మరువక ముందే రబీలో మరోసారి అవస్థలు ఎదురవుతున్నాయి. ఒక్క బస్తా కోసం రైతులు ఆర్ఎస్కేల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తాజాగా మండలంలోని కరగాంలో యూరియా పంపిణీలో రాద్దాంతం జరిగింది. మంగళవారం యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. సచివాలయ పరిధిలోని కరగాం, నారాయణవలస, నర్శింగపల్లి, పెద్ద కరగాం, అంప్లాం గ్రామాల్లో రైతులు అధికంగా రబీలో వరి వేశారు. దీంతో వ్యవసాయాధికారి వై.సూర్యకుమారి రైతుల అభ్యర్థన మేరకు 450 బస్తాల యూరియాకు ఇండెంట్ పెట్టారు. సోమవారం యూరియా వచ్చింది. ఈ మేరకు రైతుల పేర్లు వీఏఏ రాసుకొని మంగళవారం సాయంత్రం నుంచి పంపిణీ ప్రారంభించారు. యూరియా పంపిణీ చేపడుతున్న సమయంలో నర్శింగపల్లికి చెందిన టీడీపీ నాయకుడు వచ్చి యూరియా బస్తాలు గంపగుత్తుగా తీసుకుపోవడానికి ప్రయత్నింగా రైతులు అడ్డుకున్నారు. గతంలో కూడా ఇదే వ్యక్తి 50 బస్తాలు తీసుకెళ్లాడని, ఇప్పుడు మళ్లీ అలాగే తీసుకుపోతే మిగిలిన రైతుల పరిస్థితి ఏంటని ఎదురు తిరిగారు. దీంతో కొద్ది సమయం వాగ్వాదం జరిగింది. సచివాలయ సిబ్బంది భయపడి సచివాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తర్వాత సమాచారం తెలుసుకున్న నరసన్నపేట పోలీసులు వచ్చి పరిస్థితులు చక్కదిద్ది 120 బస్తాల ఎరువులు పంపిణీ చేయించారు. ఈ విషయంపై వ్యవసాయాధికారి సూర్యకుమారి మాట్లాడుతూ ఇంకా 330 బస్తాల యూరియా ఉందని, వీఏఏ రాసుకున్న పేర్లు మేరకు అందించేందుకు రైతులు సహకరించాలని కోరారు.


