బీఈడీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో జనవరి 27 నుంచి జరగాల్సిన మొదటి సెమిస్టర్ బీఈడీ పరీక్షలను వాయిదా వేసినట్లు బీఆర్ఏయూ పరీక్షల విభాగం డీన్ డాక్టర్ ఎస్ ఉదయభాస్కర్ తెలిపారు. పరిపాలనా సంబంధిత కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేశా మని ఆయన అన్నారు. తిరిగి ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తా మని అన్నారు. బీఈడీ పరీక్షలు వాయిదా పడిన సమాచారం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లకు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లకు తెలియజేశామన్నారు. ఈ పరీక్షలు మళ్లీ ఎప్పు డు నిర్వహిస్తామనేది విశ్వవిద్యాలయంలో వెబ్సైట్ ద్వారా, ఇతర అధికారిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తామన్నారు.
నేటి నుంచి ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు మంగళవా రం నుంచి మొదలుకానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 26 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న మూడు వేల మంది విద్యార్థులు ఈ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నాయి. ఇందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు వారం రోజులపాటు జరగనున్నాయి. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలు 119 కేంద్రాల్లో జరగనున్నాయి. ఇందుకు ఆర్ఐఓ ఆర్.సురేష్కుమార్ నేతృత్వంలో డీఈసీ కమిటీ ప్రతినిధులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఢిల్లీ పరేడ్లో ఆమదాలవలస వాసి
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణం పూజారిపేటకు చెందిన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూజారి సంతోష్కుమార్ సోమ వారం ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో సెలెక్ట్ అయిన వారిలో ఆమదాలవలసకు చెందిన వ్యక్తి ఎంపిక కావడం గర్వకారణమని స్థానికులంటున్నారు. ఆయన తండ్రి ఆర్పీఎఫ్ మాజీ ఇన్స్పెక్టర్ పి.మోహనరావు, తల్లి జయలక్ష్మి, అన్నయ్య కిరణ్కుమార్ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.
కాలిపోయిన చిన్నారి మృతి
శ్రీకాకుళం: నగరంలోని చిన్న బొందిలీపురానికి చెందిన ఆశాజ్యోతి(9) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈ నెల 11న వంట చేసే ఆట ఆడుకుంటూ మంటలు చెలరేగడంతో కాలిపోయిన విషయం తెలిసిందే. విశాఖ కేజీహెచ్లో 15 రోజులపాటు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బీఈడీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా


