పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ రేపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ గురువారం నిర్వహించనున్నట్లు ట్రెజరీ ఉప సంచాలకులు సీహెచ్ రవి కుమార్ మంగళవారం తెలిపారు. ప్రిన్సిపాల్ అకౌంట్ జనరల్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ, కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘పెన్షన్, జీపీఎఫ్ అదాలత్‘ ఉంటుందని చెప్పారు. జిల్లాలో ఉన్న డీడీఓలు హాజరు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి, ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అకౌంటెంట్ జనరల్ జీపీఎఫ్కు సంబంధించిన సమస్యలు ఉంటే నివేదించి పరిష్కారం పొందవచ్చని తెలిపారు.
‘సంక్రాంతికల్లా
సమస్య పరిష్కరిస్తాం’
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పోస్టాఫీస్లో భారీస్కామ్కి గురైన బాధితులకు సంక్రాంతి నాటికి క్లెయిమ్స్ సెటిల్ చేస్తామని పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు హామీ ఇచ్చారు. స్థానిక పోస్టాఫీస్ వద్ద బాధిత ఖాతాదారులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో మంగళవారం పోస్టల్ ఎస్పీ స్థానిక పోస్టల్ కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలియజేస్తున్న బాధిత ఖాతాదారుల తో మాట్లాడారు. పోస్టల్ ఏడీ నవీన్కుమార్తో బాధిత ఖాతాదారులతో ఫోన్ ద్వారా మాట్లాడించారు. 33 మంది ఖాతాదారులకు వడ్డీతో సహా సొమ్ము అందిస్తామన్నారు. దీంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. కేసును సీబీఐకి అందజేయడంతో పాటు భాగస్వాములైన వారి నుంచి రికవరీ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
విద్యార్థులకు ప్రధానితో మాట్లాడే అవకాశం
● పరీక్ష పే చర్చ పేరిట నిర్వహణ
● 6 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు అర్హులు
● జనవరి 11 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం
శ్రీకాకుళం: ప్రధాన మంత్రితో విద్యార్థులు మాట్లాడే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పరీక్ష పే చర్చ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. పరీక్ష పే చర్చ యాప్లో ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. జన వరి 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏటా పరీక్షలకు ముందు పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అందరూ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులకు పరీక్షల పై ఉన్న సందేహాలు భయాలు, సలహాలను నేరుగా ప్రధా నికి తెలియజేసే అవకాశం ఉంటుంది. పరీక్షలను సమర్థంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడానికి ప్రధాని సమాధానాలు ఇవ్వడం గత కొన్నేళ్లుగా వస్తోంది. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాల లోపు ఉండాలి. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వారు కూడా ఆన్లైన్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మంచి ప్రశ్నలను ఎంపిక చేసి వారిని నేరుగా ప్రధానమంత్రిని కలిసే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. అలాగే ప్రతి విజేతకు ఓ ప్రత్యేక కిట్టును అందజేస్తారు. ప్రశంసా పత్రాన్ని కూడా ఇస్తారు. విజేతల ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్ పొందే అవకాశం ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవాలనుకునే విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారి మొబైల్ నంబర్తో పాటు జిమెయిల్ ఖాతాను కూడా ఎంటర్ చేస్తే ఓటీపీతో లాగిన్ అవ్వవచ్చు. మొబైల్ జిమెయిల్ నంబర్ లేని వారు ఉపాధ్యాయుల లాగిన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.


