చేపల వేట కోసం దేనికై నా సిద్ధం | - | Sakshi
Sakshi News home page

చేపల వేట కోసం దేనికై నా సిద్ధం

Dec 13 2025 7:21 AM | Updated on Dec 13 2025 7:21 AM

చేపల వేట కోసం దేనికై నా సిద్ధం

చేపల వేట కోసం దేనికై నా సిద్ధం

పోర్టు, మత్స్యశాఖ అధికారులకు తేల్చిచెప్పిన మత్స్యకారులు

సంతబొమ్మాళి: మూలపేట పోర్టుకు తాము వ్యతిరేకం కాదని, అదే సమయంలో తమ జీవనాధారమైన సముద్రంలో చేపల వేట కోసం చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమేనని మత్స్యకారులు తెగేసిచెప్పారు. శుక్రవారం సంతబొమ్మాళి మండలం భావనపాడు జట్టి ప్రాంతంలో మత్స్యకారులతో పోర్టు, మత్స్యశాఖ, మైరెన్‌ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ సముద్రంలో చేపలు పడే ప్రాంతాన్ని ఆక్రమించుకొని గ్రిడ్జింగ్‌ పనులు చేపడుతున్నారని, ఇప్పుడు ఈ ప్రాంతంలో చేపల వేట చేయకూడదని చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి10 గంటల వరకు సముద్రంలో డ్రెడ్జింగ్‌ పనులు ఆపేస్తే ఆ సమయంలో వేట చేసుకుంటామని చెప్పారు. పోర్టు నిర్మాణంలో భావనపాడు సముద్రం ముఖద్వారాన ఇసుకమేటలు వేయడం వల్ల మూడేళ్లుగా వేట సాగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇప్పుడు కోనేం, ఇతర చేపలు సమృద్ధిగా దొరికే అవకాశముందని, 45 రోజులు పాటు వేట చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. వేట సాగనివ్వకపోతే సుమారు 836 కుటుంబాలు వలసబాట తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణంలో భాగంగా ఏ ఒక్క మత్స్యకారుడికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, ఇప్పుడు చేపల వేట కూడా చేయవద్దంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. మా సమస్యలు చెప్పుకోవడానికి అధికారుల వద్దకు వెళ్తే తిరిగి వారి సమస్యలను చెప్పడం భావ్యం కాదన్నారు. పోర్టుతో పాటు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంతో తమకు మేలు చేకూరేలా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ, టెక్కలి మత్స్యశాఖ అధికారి ధర్మరాజు పాత్రో, మైరెన్‌ సీఐ రాము, మత్స్యకార సంఘ అధ్యక్షుడు గొరకల ఆదినారాయణ, మత్స్యకార నాయకులు కారాడ చిన్నబాబు, ఆలుపిల్లి పోతయ్య, రాజేష్‌, కారాడ చిన్నయ్య, కారాడ పోతయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజీపడలేం..

భద్రత విషయంలో రాజీపడితే మత్స్యకారులకే ప్రమాదమని పోర్టు అధికారులు తేల్చిచెప్పారు. డ్రెడ్జింగ్‌ సమయంలో బోట్లు వస్తే ప్రమాదం జరిగి అందరూ బాధపడాల్సి వస్తుందన్నారు. ఆ ప్రాంతంలో కాకుండా మిగతా చోట వేట సాగించుకోవచ్చన్నారు. డ్రెడ్జింగ్‌ జరిగే ప్రాంతానికి బోట్లు వస్తే క్షణాల్లో ముక్కలైపోతాయని చెప్పారు. అయినప్పటికీ సమస్యను పోర్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement