
ఐటీడీఏ సాధనే లక్ష్యం
సారవకోట: జిల్లాలోని మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు సాధనే శనివారం జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ లక్ష్యమని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ముఖ్య ఉద్దేశాన్ని ప్రస్తుత పాలకులు మరచిపోయి దీనిని ఒక జాతర, లేదా పండుగా నిర్వహిస్తున్నారని, అయితే అసలైన లక్ష్యం నెరవేర్చడం లేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం ఆదివాసీల జీవితాల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా నేటికీ కనీస మౌలిక వసతులు లేని గిరిజన గ్రామాలున్నాయన్నారు. సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేసిన తర్వాత, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 16 మండలాల్లోని 2 లక్షల మంది గిరిజనులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి మెళియాపుట్టి మండలంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరారు.
రైతు బిడ్డకి డాక్టరేట్
శ్రీకాకుళం న్యూకాలనీ: కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూకే) నుంచి జిల్లాకు చెందిన లింగాల ప్రసాదరావు పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ‘శ్రీకాకుళం జిల్లా బ్యాంకింగ్ రంగంలో మానవ మూలధనం మరియు పనితీరుపై ఒక అంచనా’ అనే శీర్షికతో ఆయన చేసిన పరిశోధన విజయవంతంగా పూర్తి చేశారు. జేఎన్టీయూకే మేనేజ్మెంట్ స్టడీస్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పి.విజయ్కుమార్, అదే వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.చార్వక్ మార్గదర్శకత్వంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రసాద్ విజయనగరంలోని లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ప్రసాదరావు స్వగ్రామం పొందూరు మండలంలోని కేశవదాసుపురం గ్రామం. తల్లిదండ్రులు లింగాల ఆసిరప్పుడు, పార్వతి, భార్య శాంతి ప్రోత్సాహం, మద్దతను మర్చిపోలేనన్నారు. తన పీహెచ్డీ పట్టాను తమ కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నట్టు తెలియజేశారు.
గూడ్స్ గోదాం పరిశీలన
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలోని గూడ్స్ గోదాం, అవేజ్ రాక్ గోదాంను శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం పరిశీలించారు. సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి ఎరువుల పక్కదారిపై ఆరా తీశారు. అవేజ్ ర్యాక్ గోదాంకు సంబంధించి అధికారులను ప్రశ్నించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు సంబంధించి 1,320 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయని తెలియజేశారు. ప్రైవేటు డీలర్లకు 660 మెట్రిక్ టన్నులు, మార్క్ఫెడ్కు 660 మెట్రిక్ టన్నులు పంపించినట్లు లెక్కలు చూపించారు. అయితే ప్రైవేటు డీలర్లకు ఎవరెవరికి ఎన్ని బస్తాలు వెళ్లాయో వివరాలు పంపించాలని డీఏవో త్రినాథస్వామికి సూచించారు. రాక్, మార్క్ఫెడ్ అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశీలనలో మార్క్ఫెడ్ డీఎం రమణి, తహసీల్దారు రాంబాబు, ఏవో మెట్ట మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
బంగారు కుటుంబాలకు వైద్యుల సాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీ–4 కార్యక్రమానికి డాక్టర్లు మద్దతు పలికారు. జిల్లాలోని బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను శుక్రవారం వారి కార్యాలయంలో వివిధ రంగాలకు చెందిన 85 మంది వైద్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని 2,580 బంగారు కుటుంబాలకు తాము మార్గదర్శకులుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. దీంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వైద్యులను అభినందిస్తూ, సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ సనపల నర్సింహమూర్తి, డీసీహెచ్ఎస్ డాక్టర్ నూర్తి కల్యాణ్ చక్రవర్తి, డాక్టర్ భవానీ, డాక్టర్ శిరీష, డాక్టర్ అరవింద్, డాక్టర్ రేవతి, పిల్లల వైద్యుడు డాక్టర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ సాధనే లక్ష్యం

ఐటీడీఏ సాధనే లక్ష్యం

ఐటీడీఏ సాధనే లక్ష్యం