
ఆదిత్యుని జ్ఞాపికను హీరో సాయిధరమ్తేజ్కు అందజేస్తున్న ఆలయ సిబ్బంది
బైక్ ప్రమాదం తర్వాత ఆలయాల్లో అభిమానులు చేసిన ప్రార్థనలే తన ప్రాణాలను నిలబెట్టాయని మెగా హీరో సాయిధరమ్తేజ్ అన్నారు. ఆయన శుక్రవారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన కథానాయకుడిని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు.
ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు మండవిల్లి రవి తదితరులు ఆయనకు గౌరవ స్వాగతం పలికి అంతరాలయంలో గోత్రనామాలతో పూజలు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
అనంతరం హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘బ్రో’ చిత్రం త్వరలో విడుదల కానుందని, చిత్రం విజయం కావాలని, అలాగే అందరి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఆదిత్యునికి పూజలు చేశానని, మొక్కు చెల్లించుకున్నానని వివరించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు భారీగా స్వాగతం పలుకుతూ క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేశారు.
ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథుడిని ఆయన శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.
– అరసవల్లి