ఓడీచెరువు: వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో కోతలను నివారించి , సక్రమంగా విద్యుత్ను సరఫరా చేయాలని మండల పరిధిలోని కొండకమర్ల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ కోతలతో పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఓ పక్క వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయని, దీనికి తోడు విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో సాగు మరింత భారమైందని వాపోయారు. సమాచారం అందుకున్న విద్యుత్శాఖ ఏఇడీ ఓబులేసు, ఏఇ గౌరీశంకర్రెడ్డి సబ్స్టేషన్ చేరుకొని రైతులతో చర్చించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
పశువధశాల నిర్వహిస్తున్న నలుగురి అరెస్ట్
హిందూపురం టౌన్: పట్టణంలోని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో పశువధశాలను నిర్వహిస్తున్న నలుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ మహేష్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 5న మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, టూటౌన్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా పట్టణంలోని రహమత్పురం, సూరప్పకట్ట ప్రాంతంలో నిర్వహిస్తున్న పశువుల కొట్టాలను తనిఖీ చేశారన్నారు. అయితే వధ చేయడానికి ఉంచిన 9 ఆవులు, 55 దూడలను గుర్తించి, వాటిని సంరక్షణ నిమిత్తం గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. వాటిని నిర్వహిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.


