పుట్టపర్తి అర్బన్: పీఎం సూర్యఘర్ పథకం పనులు ఈ నెలాఖరుకు వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో పర్యటించిన కలెక్టర్ పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లు, నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 11,987 గృహాలు గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 8,687 గృహాలకు ఇన్స్టలేషన్ పూర్తి చేశామన్నారు. తక్కిన 2,300 గృహాలకు ఈనెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న గృహ లబ్ధిదారులతో ఈ పథకం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ నరసయ్య, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాగు, సాగునీటి ఇబ్బందుల్లేకుండా చర్యలు
పుట్టపర్తి టౌన్: జిల్లాలో తాగు, సాగునీటికి ఇబ్బందులకు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. చిత్రావతి నది పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పుట్టపర్తి పట్టణ సమీపంలో ఉన్న చిత్రావతి నదిని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే సిఽంధూరారెడ్డి, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో జిల్లా కేంద్రంలో సాగు, తాగునీటి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యంతో పాటు పూడికతీత పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీనిద్వారా చిత్రావతి నదిలో నీటి సామర్థ్యం పెరిగి భూగర్భజలాలు వృద్ధి చెందుతాయన్నారు. పట్టణ పరిధిలోని చిత్రావతి నదిలో వ్యర్థాలు కలవకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులుతో పాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.


