రాప్తాడురూరల్: అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థం కోసం లేనిచోట కొత్తగా తీయించిన ‘యూటర్న్’ వద్ద మరో నిండుప్రాణం బలైంది. నెల తిగరకుండానే అదే స్పాట్లో మరో వ్యక్తి మృతి చెందడం కలచివేస్తోంది. నగర శివారు బళ్లారి రోడ్డు ఎంవైఆర్ ఫంక్షన్ హాలు దాటిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన యూటర్న్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మరిమాకులపల్లికి చెందిన కృష్ణమనాయుడు (60) స్థానికంగా వాచ్మన్గా పని చేస్తున్నాడు. పనిమీద బైకుపై నగరానికి వచ్చి తిరిగి సిండికేట్నగర్కు వెళ్తూ... యూటర్న్ వద్ద తిప్పుకుంటుండగా వెనుక వైపు నుంచి వచ్చిన బుల్లెట్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కృష్ణమనాయుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బుల్లెట్ నడుపుతున్న యువకుడు గార్లదిన్నె మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పీఎస్ ఎస్ఐ కొమ్మినేని రాంబాబు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
తరచూ ప్రమాదాలు
కొత్తగా ఏర్పాటు చేసిన యూటర్న్ చాలామంది వాహనదారులకు తెలీదు. ఇక్కడ సరైన హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూటర్న్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్నూ తొలగించడం కొసమెరుపు. ఈ క్రమంలో వేగంగా వచ్చే వాహనాలు యూటర్న్ తీసుకునే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నాయి. గతనెల 15న ఇదే యూటర్న్ వద్ద కారు మలుపు తిరుగుతుండగా బైకుపై వేగంగా వచ్చిన నరసనాయనికుంటకు చెందిన హరిజన నరేష్ కారును బలంగా ఢీకొని స్పాట్లోనే మృతి చెందాడు. అదే స్థలంలో తాజాగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో యూటర్న్ను తొలగించడం లేదా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బళ్లారి రోడ్డులో కొత్త యూటర్న్ వద్ద మరో ప్రాణం బలి


