ధర్మవరం: గత ఎన్నికల సమయంలో నారా లోకేష్ కర్ణాటకకు వెళ్లి అక్కడ పెట్రో ఉత్పత్తుల ధరలు చూపి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోనూ అదే రీతిలో ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎందుకు తగ్గించలేదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. గ్యాస్ ధరల పెంపుతో ప్రజల నెత్తిపై బండ వేస్తున్నారని మండిపడ్డారు. పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 పెంచడం సబబు కాదన్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా లేకపోవడం వల్ల హోటళ్లు, హాస్టళ్లు, పీజీలలో ఆకలి కేకలు వినిపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2008లో కేంద్రం గ్యాస్ ధరలు పెంచితే ఆ భారం రాష్ట్ర ప్రజలపై పడకుండా అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సిలిండర్పై రూ.50 చొప్పున భరించిందని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోగా రూ.1 సెస్ వేసి పెంచిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజల కష్టాలు చంద్రబాబుకు నిజంగా తెలిస్తే పెంచిన గ్యాస్ ధరల భారం ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలన్నారు. 2008లో క్రూడ్ ఆయిల్ ఽబ్యారెల్ ధర 99 డాలర్లు ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ రూ.51, డీజిల్ రూ.36తో లభ్యమయ్యేదని గుర్తు చేశారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్లు ఉందని, అయినా లీటర్ పెట్రోల్ రూ.109, డీజిల్ రూ.90 ఉండటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పెట్రో ఉత్పత్తుల ధరల విషయం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా సరికాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు కోటిరెడ్డి బాలిరెడ్డి, నీలూరి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందమూరి నారాయణరెడ్డి, కత్తె పెద్దన్న, కౌన్సిలర్లు బోయ రమాదేవి, కత్తె ఆదిలక్ష్మి, సబేహ, పద్మజ, సునీత తదితరులు పాల్గొన్నారు.
పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తామన్న నారా లోకేష్ హామీలు ఏమయ్యాయి?
పెంచిన ధరలను ప్రభుత్వమే భరించాలి
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి


