పెనుకొండ రూరల్: పంచాయతీ పరిధిలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ లోకాయుక్తను పెనుకొండ మండలం మావటూరు గ్రామ సర్పంచ్ నాగరాజు ఆశ్రయించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో పంచాయతీ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరించారు. ప్రభుత్వం మారినా అభివృద్ధి పనుల్లో ఎక్కడేగాని రాజీ పడకుండా పూర్తి చేయించామన్నారు. ఇందుకు గాను రూ. 10 లక్షలకు పైగా అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం పంచాయతీలో రూ.7 లక్షల నిధులు ఉన్నా... అధికారులు మాత్రం బిల్లులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరంలో పదవీ కాలం ముగియనుందని, ఆ తర్వాత తన గోడు ఎవరూ పట్టించుకోరంటూ వాపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు.


