బత్తలపల్లి: ‘నా చావు వెనుక ఎవరి ప్రమేయం లేదు. కేసులు పెట్టుకోవద్దు’ అంటూ ఓ గర్భిణి ఉత్తరం రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన బెల్లపుకొండ శ్రీనివాసులు కుమార్తె శ్రీలక్ష్మి(20)కి బత్తలపల్లికి చెందిన ఆలకుంట శ్రీనివాసులుతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. అన్యోన్యంగానే ఉండేవారు. ప్రస్తుతం శ్రీలక్ష్మి గర్భిణి. గురువారం వైద్య పరీక్షలకు వెళ్లేందుకు సిద్ధమైన ఆమె స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆ సమయంలో భర్త శ్రీనివాసులు తన సోదరి కుమార్తెను పాఠశాలలో వదిలేందుకు వెళ్లాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు ఎంత తట్టినా శ్రీలక్ష్మి తలుపు తీయకపోవడంతో బలవంతంగా తెరిచి లోపలకు ప్రవేశించాడు. అప్పటికే ఇంట్లో ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న భార్యను గమనించి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఆమెను కిందకు దించి మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో శ్రీలక్ష్మి బంధువులు బత్తలపల్లికి చేరుకున్నారు. తమ బిడ్డను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. మృతురాలి తండ్రి శ్రీనివాసులు రిమాండ్ ఖైదీగా కడప జైలులో ఉన్నాడని, ఆయన వచ్చి ఫిర్యాదు చేసే వరకూ మృతదేహాన్ని అక్కడి నుంచి కదిలించేది లేదని భీష్మించారు. సమాచారం అందుకున్న ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్, తహసీల్దార్ స్వర్ణలత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా మృతురాలు తన చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయానని, తండ్రి జైలులో ఉన్నాడని, తాను సంతోషంగా ఉండడం బంధువులకు ఇష్టం లేదని, తన మృతి వెనుక ఎవరి ప్రమేయం లేదని లేఖ రాసి పెట్టింది. కేసులు కూడా పెట్టుకోవద్దని అందులో కోరింది. ఈ ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలక్ష్మి తండ్రి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.
ఉరి వేసుకుని గర్భిణి ఆత్మహత్య
నాలుగు నెలల క్రితం వివాహం
అత్తింటి వారే చంపారంటూ బంధువుల ఆరోపణ


