సాక్షి, పుట్టపర్తి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం గురువారం జిల్లా వ్యాప్తంగా పండువలా జరిగింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల, గ్రామాల్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ కార్యాలయాల్లో పార్టీ పతాకాన్ని ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
పుట్టపర్తిలో ఘనంగా వేడుకలు..
మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి నివాసంలో ఆయన సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు.
జగన్ సీఎంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం..
వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి అన్నారు. హిందూపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో 16వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం పట్టణంలోని వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వద్దకు వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు.
జగన్ను సీఎం చేసుకుందాం..
వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకుందామని మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు వైసీ గోవర్దన్రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్లో జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. రాష్ట్రం బాగు పడాలంటే వైఎస్ జగన్ లాంటి వ్యక్తి సీఎంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.
కదిరిలో వేడుకలు..
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్, యాక్టివిటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కదిరి పట్టణంతో పాటు కుమ్మరవాండ్లపల్లి గ్రామం, తలుపుల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మక్బూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పలు ఆలయాల ప్రతిష్ట దెబ్బ తింటోందన్నారు.
ధర్మవరంలో భారీ బైక్ ర్యాలీ..
వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధర్మవరంలో జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. జై జగన్. నినాదాలతో ధర్మవరం పట్టణం దద్దరిల్లింది.
వైఎస్సార్ సీపీ జెండా ఊరూవాడా రెపరెపలాడింది. కార్యకర్తల హృదయాంతరాల్లోంచి వచ్చిన జగన్నినాదం జిల్లా అంతా మార్మోగింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం పండుగలా సాగింది. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఎప్పుడూ ప్రజల పక్షానే
పరిగి: అధికారంలో ఉన్నా.. లేకున్నా వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ అన్నారు. గురువారం ఆమె పరిగి మండల కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్లో పార్టీ నాయకులతో కలిసి వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగనన్నను మరోసారి సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంతటి దరిద్రపు ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. జగన్ 2.0 నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్తుందన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకూ జగనన్న అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ అబద్ధాల పాలనతో ప్రజలు విసిగిపోయారని, రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. జగనన్నను సీఎంగా చూడాలన్న ప్రజల ఆకాంక్ష మరోసారి నెరవేర్చడానికి ప్రతి కార్యకర్త కష్టపడాలని కోరారు.
పండగలా వైఎస్సార్సీపీ ఆవిర్భావ
దినోత్సవం
జిల్లా వ్యాప్తంగా మార్మోగిన
జగన్నినాదం
కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న
అభిమానులు
సేవా కార్యక్రమాలతో
స్ఫూర్తిగా నిలిచిన వైనం


