అనంతపురం క్రైం: అహుడా (అనంతపురం–హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను అహుడా వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్ అదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల అంశంపై సంబంధిత అధికారులతో గురువారం అనంతపురంలోని అహుడా కార్యాలయంలో అహుడా చైర్మన్ టి.సి.వరుణ్, సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. అనధికార లే అవుట్లు, ప్లాట్ల నియంత్రణ పథకం కింద వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రతి కొనుగోలుదారునికి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. అనుమతి లేకుండా ప్లాట్లు వేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే అధికారిక లేఅవుట్లలో మూడేళ్ల తరువాత కూడా అభివృద్ధి పనులు చేపట్టని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కందుకూరు, కుణుతూరు లేఅవుట్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో అహుడా పీఓ ఇషాక్, ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణకుమారి, ఏఓ రవిచంద్రన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జేపీఓ హరీష్చౌదరి, డీఈ రేవంత్, సర్వేయర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
అహుడా వైస్ చైర్మన్ విష్ణుచరణ్


