బాబు వంచనపై గర్జన
న్యూస్రీల్
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
అనంతపురం: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిలిచిపోవడానికి కారణమైన సీఎం చంద్రబాబు వైఖరి, మోసంపై అనంతపురం జిల్లా రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ప్రజల గర్జన ప్రభుత్వాన్ని ఉలిక్కి పడేలా చేసింది. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో పోతిరెడ్డిపాడు’కు వేలాదిమంది అన్నదాతలు, ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి ప్రభుత్వాన్ని నిలదీశారు. పోతిరెడ్డిపాడు కార్యక్రమం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేయాలని నినదించారు.
‘జల’కంటక సర్కార్పై గర్జించిన గళాలు
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్ధాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను ఫణంగా పెట్టిన సీఎం చంద్రబాబు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేసింది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జించింది. ‘తీరు మారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్’ అంటూ హెచ్చరించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్పై చిత్తశుద్ధి లేకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదుంటూ హెచ్చరించింది. ‘తెలంగాణ మాదిరే రాయలసీమకు 800 అడుగుల స్థాయిలోనే శ్రీశైలం నీరు రావాలి. చంద్రబాబుకు ‘ఓటుకు నోటు’ కేసు భయం ఉంది. హైదరాబాద్లో ఆస్తులను కాపాడుకునేందుకు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారం’టూ మండిపడింది.
సంఘటితమైన సీమ నేతలు
రాయలసీమ ప్రయోజనాలపై రాజీ పడబోమని సీమ నేతలు, రైతులు పిడికిలి బిగించారు. వీరికి మద్దతుగా‘ సీమ’ ప్రయోజనాలు కాంక్షించే పలు రైతు, ప్రజా సంఘాల నేతలు సభలో పాల్గొన్నారు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా.. వాడుకోలేని దయనీయ స్థితి. సీమకు, కృష్ణా జలాలకు అడ్డంకిగా ఉన్న చంద్రబాబు తీరును ఎండగట్టారు. రాయలసీమ అంటే కరువు పీడిత ప్రాంతం కాదు.. బాబు పీడిత ప్రాంతమని రైతులు ఏకరువు పెట్టారు. రాయలసీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారిందన్నారు.
పోతిరెడ్డిపాడు సభకు పోటెత్తిన జనం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందే
రాయలసీమ కరువు ప్రాంతం కాదు.. చంద్రబాబు పీడిత ప్రాంతం
సాగు–తాగునీటి హక్కుల సాధనకు మరో స్వాతంత్య్ర పోరాటం చేస్తాం
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో పోతిరెడ్డి పాడు’ గ్రాండ్ సక్సెస్
బాబు వంచనపై గర్జన


