ప్రకృతి వ్యవసాయం అద్భుతం
తాడిమర్రి: జిల్లా రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం సభ్యులు కొనియాడారు. గురువారం ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం సభ్యులు డాక్టర్ బ్రూనో డోరియన్ (సీనియర్ ఎకనామిక్స్), పీహెచ్డీ పరిశోధకురాలు క్యారీ లేఫాల్ట్ మండలంలోని నార్శింపల్లిలో పర్యటించారు. ముందుగా ఏపీ సీఎన్ఎఫ్ అధికారులు, రైతులు వారికి ఘన స్వాగతం పలికి ఎద్దుల బండిపై గ్రామంలో ఊరేగించారు. అనంతరం వారు ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అధ్యయనం చేశారు. పంటల సాగు, దిగుబడి, ఆదాయం తదితర వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజన్ లక్ష్మా నాయక్, సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ నవీన్ పరిశోధన బృందానికి ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. అనంతరం పరిశోధన బృంద సభ్యులు వ్యవసాయంపై సెమీ డైరెక్టివ్ ఇంటర్వ్యూల ద్వారా సర్వే నిర్వహించారు. ముందుగా సీఆర్పీ నబీరసూల్తో చర్చించిన అనంతరం ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్, పీఎండీఎస్ మోడల్స్ తదితర రకాల పంటలు పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులను కూడా కలిసి పంటల సాగు, ఖర్చు, దిగుబడి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్వైఎస్ఎస్ సిబ్బంది హరికుమార్, గంగమ్మ, ఎల్వన్ నారాయణప్ప, ఎన్ఎఫ్ఐ శ్రీహర్ష, ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు.
కితాబునిచ్చిన ఫ్రాన్స్కు చెందిన
అంతర్జాతీయ బృందం


