అరణ్యవాసా.. చెన్నకేశవా!
పుట్టపర్తి: అరణ్యాన వెలసినా... తన భక్తుల మదినే ఆవాసంగా చేసుకున్న చెన్నేకేశవ స్వామి తడకోత్సవానికి సర్వం సిద్ధమైంది. బుక్కపట్నం మండల పరిధిలోని చండ్రాయునిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలసిన చెన్నకేశవ స్వామి భక్తులకు కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. శతాబ్దాల కిందట ఇక్కడ వెలసిన స్వామిని భక్తులు మల్లో చెన్నుడని, జెన్నావలప్ప అని రకరకాల పేర్లతో కొలుస్తుంటారు. ఏటా మాఘమాసంలో తరుగువాండ్లపల్లికి చెందిన తరుగు వంశీయులు ఆనవాయితీగా తడకోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ శనివారం స్వామి వారికి తడకోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారన్నారు. ఇక స్వామి వెలసిన కొండ మరోభాగంలో దీపం గుండుకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ గుండుపై దీపం వెలిగిస్తే సుదూరంలో ఉండే చెన్నకేశవ ఆలయంలో ఉన్నవారికి కనిపిస్తుందని ఇక్కడి వారు చెబుతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆదాయం ఉన్నా దేవదాయ శాఖ అధికారులు మాత్రం ఆలయం అభివృద్ధికి గానీ భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏర్పాట్లు పూర్తి..
శనివారం జరిగే తడకోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తరుగు వంశీయులు తెలిపారు. తాగునీరు, అన్నదాన ప్రసాదాలు అందించే ఏర్పాట్లు పూర్తి చేశామని, వాహనాల పార్కింగ్కు కొండపై చదును చేశామన్నారు.
చండ్రాయునిపల్లి సమీపంలో
వెలసిన చెన్నకేశవ స్వామి
రేపు తడకోత్సవం..
వేలాదిగా తరలిరానున్న భక్తులు
అరణ్యవాసా.. చెన్నకేశవా!


