రోడ్డు నిర్మాణం వివాదాస్పదం
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డిపల్లి సమీపంలో క్రషర్ల యజమానులు నిర్మిస్తున్న రోడ్డు వివాదాస్పదంగా మారింది. గురువారం నిర్మాణ పనులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని క్రషర్ల యజమానులకు అండగా నిలిచి తమకు అన్యాయం చేశారంటూ రైతులు వాపోతున్నారు. బాధితులు తెలిపిన మేరకు...అనంతపురం–కదిరి రహదారి నుంచి క్రషర్ల వద్దకు వెళ్లేదారి 8 అడుగులు (బండిరస్తా) మాత్రమే ఉందని రైతులు చెబుతున్నారు. ఇక్కడ దాదాపు 25 అడుగుల వరకు బీటీ రోడ్డు వేస్తున్నారు. క్రషర్ల యజమానులు సొంత నిధులతో రోడ్లు నిర్మిస్తున్నారు. గతంలోనూ ఈ రోడ్ల మీదుగానే తాము తిరుగుతున్నామని దుమ్ముధూళితో పంటలు నష్టపోతున్నామని చెప్ప డంతో బీటీ రోడ్లు నిర్మిస్తున్నామని యజమానులు చెబుతున్నారు. తమ భూముల్లో రోడ్లు వేస్తున్నారంటూ రైతులు పనులను అడ్డుకోగా. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రైతులు మాట్లాడుతూ అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ వాపోయారు. రైతులకు కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. 10 సెంట్ల నుంచి ఎకరా వరకు భూములు కోల్పోతున్నామని, అధికారులు పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టి జైల్లోకి పెడతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం కూడా చెల్లించకుండా ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో రోడ్లు వేస్తున్నారన్నారు. క్రషర్ల యజమానులు మాట్లాడుతూ... ఇప్పటికే నెల రోజుల పాటు క్రషర్లు బంద్ చేశామన్నారు. రోడ్డు సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాస్తవానికి 40 అడుగుల రోడ్డు ఉందని ఇందులో తాము 30 అడుగుల్లో మాత్రం రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. సొంత నిధులతో రోడ్లు వేస్తున్నా... అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
తమ భూముల్లో రోడ్డు వేస్తున్నారని వాపోతున్న రైతులు, రోడ్డు పనులు చేయిస్తున్న దృశ్యం
రోడ్డు నిర్మాణం వివాదాస్పదం


