‘చలో పోతిరెడ్డిపాడు’కు తరలిరండి
కనగానపల్లి: కరువు ప్రాంత రైతులకు సాగునీరందించేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా గురువారం వైఎస్సార్ సీపీ తలపెట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రితో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదన్నారు.గాలేరు, హంద్రీ–నీవా, తెలుగుగంగ కాలువలకు సంబంధించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లు అందాలంటే శ్రీశైలం డ్యాంలో 881 అడుగుల్లో నీరు ఉండాలన్నారు. కానీ 800 అడుగుల దిగువన నీరున్నా తెలంగాణ వారు పాలమూరు– రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడుకుంటున్నారన్నారు. మనకు హక్కుగా ఉన్న నీటిని వాడుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టి, అప్పట్లోనే 50 శాతం పనులు కూడా పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకం పనులను అన్యాయంగా ఆపేశారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో సాగునీటి హక్కుల కోసం రాయలసీమ రైతులంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద చేపట్టనున్న బహిరంగ సభకు రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపు


