
మాఫియా డాన్ల ఉలికిపాటు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రేషన్ బియ్యం మాఫియా డాన్లు అప్రమత్తమయ్యారు. ఈనెల 21న సాక్షిలో ‘మాఫియా గుప్పిట్లో రేషన్’ శీర్షికతో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బియ్యం మాఫియా డాన్లు ఉలిక్కిపడ్డారు. చిన్న చిన్న సరఫరాదారులందరూ ఒక్కసారిగా కలుగుల్లోకి వెళ్లినట్లు తెలిసింది. గతంలో ఎప్పుడూ పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రాలేదని, అందరూ కొన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని డాన్ల నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బియ్యం సేకరించి గోడౌన్లకు చేర్చే ఏజెంట్ల మధ్య అనైక్యత కారణంగానే మీడియాకు సమాచారం వచ్చిందని మాఫియా డాన్లు తీవ్రంగా మండిపడ్డారు. మీ మధ్య ఉన్న వివాదాల కారణంగా సమాచారం బయటకు వెళుతోందని, జాగ్రత్తగా లేకపోతే మనకు తీవ్ర నష్టం జరుగుతుందని సరఫరా ఏజెంట్లకు చెప్పారు. సేకరించిన బియ్యాన్ని తమ దగ్గరే కొద్ది రోజులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు.
వారం రోజులు డంప్ల జోలికి వెళ్లొద్దు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉంచిన బియ్యం డంప్ల జోలికి వెళ్లద్దని మాఫియా భాగస్వాములు అందరూ నిర్ణయించినట్టు తెలిసింది. నాలుగైదురోజులు పోలీసులు, విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లయీస్ అధికారులతో సమావేశం నిర్వహించుకుని, తర్వాత సరఫరా చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే చెక్పోస్ట్ల అధికారులతోనూ, విజిలెన్స్ వారితోనూ టచ్లోకి వెళ్లినట్టు సమాచారం.
కొద్దిరోజులు ఆగాలని చిన్న సరఫరాదార్లకు దేశాలు
ఏమైనా ఉంటే సోమందేపల్లికి బియ్యం తీసుకురావాలని కబురు
‘సాక్షి’లో కథనం రావడంతో అప్రమత్తం