● జనసేన నేత బరితెగింపు
● వినాయకుడి ఆలయం వద్ద పవన్ కల్యాణ్ ఫ్లెక్సీకి గుమ్మడి కాయతో దిష్టి
● దెబ్బతిన్న భక్తుల మనోభావాలు
నెల్లూరు(బృందావనం): అధికార అహంకారం తలకెక్కిన కూటమి నేతల్లో భయం.. భక్తి లేకుండాపోతోంది. సనాతన ధర్మం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిత్యం వల్లె వేస్తున్నా, ఆ పార్టీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దైవం అంటే డోంట్ కేర్ అనే భావన వారిలో నరనరాన జీర్ణించుకుపోతోంది. పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలో ఆ పార్టీ నేత గునుకుల కిశోర్ అనుసరించిన వైఖరి తీవ్ర వివాదాస్పదమైంది.
జరిగిందిదీ..
పాదరక్షలను పవన్ కల్యాణ్ ధరించి ఉన్న నిలువెత్తు ఫ్లెక్సీని నగరంలోని చిల్డ్రన్స్పార్కు రోడ్డులో గల వినాయకస్వామి ఆలయం వద్ద ఆనించారు. ఆపై కర్పూరాన్ని వెలిగించి.. టెంకాయలు, గుమ్మడికాయ కొడుతూ దిష్టి తీసి నినాదాలు చేస్తూ ఆలయ ప్రశాంతతకు భంగం వాటిల్లేలా వ్యవహరించారు. భక్తుల మనోభావాలు గాయపడేలా నినాదాలతో హోరెత్తించారు. ఆలయంలో కొలువైన వినాయకుడికి మాత్రం వీరెలాంటి పూజలను చేయకుండా తమ పార్టీ అధినేత ప్రాపకం కోసం పాకులాడారు. ఈ తంతును గమనిస్తున్న భక్తులు.. వారిస్తే ఏ సమస్య వస్తుందోననే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు. ఈ తతంగాన్ని కొందరు తమ మొబైల్ ఫోన్లలో బందించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చివరికి విషయం తెలుసుకున్న ఆ పార్టీ నేతలు మూడు గంటల తర్వాత ఫ్లెక్సీని తొలగించారు.
పార్టీలకతీతంగా స్పందిస్తాం..
ఘటనపై హిందూ చైతన్య వేదిక నేత, జనసేన కార్యక ర్త కాకు మురళీరెడ్డి స్పందించారు. నేత నిర్వాకాన్ని తప్పుబట్టారు. హైందవ ధర్మానికి భంగం కలిగిస్తే పా ర్టీలకతీతంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. మరో వైపు ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ కార్యకర్తే ఖండించడం ఆ పార్టీలో సాగుతున్న పోరును స్పష్టం చేస్తోంది.


