● ఎనిమిది మంది అరెస్ట్
● పరారీలో మరికొందరు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులో సంచలనం రేకెత్తించిన రౌడీషీటర్ కమ్మసాయి హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. సోమవారం వేదాయపాళెం పోలీస్స్టేషన్లో నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ వివరాలు వెల్లడించారు. చంద్రమౌళినగర్కు చెందిన్ లక్ష్మీశెట్టి సాయితేజ అలియాస్ కమ్మసాయిపై గతేడాది ఏప్రిల్లో వేదాయపాళెం పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి కడప కేంద్రకారగారానికి తరలించారు. ఇటీవలే అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. సాయికి పలువురితో పాతకక్షలు, వ్యక్తిగత విభేదాలున్నాయి. ఆదివారం అతను వేదాయపాళెం పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్కు హాజరయ్యాడు. అనంతరం కె.హనుక్, ప్రేమ్కుమార్, వంశీకృష్ణ అలియాస్ నిప్పో వంశీ, సాయికుమార్, రాహుల్, ప్రదీప్, హరి, జగదీష్, మరికొందరితో కలిసి మద్యం తాగాడు. పాతకక్షలు, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో మద్యం మత్తులో చెలరేగిన వివాదంతో వారు సాయిని హత్య చేశారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో వంశీకృష్ణ, సాయికుమార్, జగదీష్పై రౌడీషీట్లు ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్నవారిని వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో వేదాయపాళెం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య పాల్గొన్నారు.


