● మంత్రి వ్యవసాయ క్షేత్రానికి
యథేచ్ఛగా మట్టి తరలింపు
● నిత్యం వందలాది టిప్పర్లలో రవాణా
● చోద్యం చూస్తున్న అధికారులు
చేజర్ల: అమాత్యుడు ఆనం రామనారాయణరెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో రహదారుల నిర్మాణం కోసం ఉలవపల్లిలోని ప్రభుత్వ భూమిలో గ్రావెల్ గుట్టను ఇటీవల పది రోజుల పాటు గుల్ల చేశారు. తాజాగా అక్కడి చెట్లకు ప్రభుత్వ భూముల్లో ఉన్న సారవంతమైన మట్టిని వందలాది టిప్పర్లలో రోజూ తరలిస్తున్నారు. తూర్పుకంభంపాడు నుండి పెరుమాళ్లపాడులోని క్షేత్రానికి పగలూ, రాత్రనే తేడా లేకుండా రవాణా చేస్తున్నారు. మంత్రి విషయం కావడంతో అటువైపు కన్నెత్తి చూసే సాహసాన్ని అధికారులు చేయలేకపోతున్నారు.
గుట్టను మాయం చేసి..
మండలంలోని ఉలవపల్లిలో కోర్టు పరిధిలో వివాదాస్పదంగా ఉన్న సర్వే నంబర్ 124లో గ్రావెల్ గుట్టను సగం మేర మాయం చేశారు. ఇదే విషయమై పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. అధికారం నాది.. ప్రభుత్వం మాది.. తనను ఎవరేమి చేస్తారనే ధీమాతో వ్యవసాయ క్షేత్రంలో రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడి చెట్లకు సారవంతమైన మట్టిని తూర్పు కంభంపాడులోని ప్రభుత్వ భూముల నుంచి మూడు రోజులుగా తరలిస్తున్నారు. ఫలితంగా అక్కడ భారీ గుంతలు ఏర్పడ్డాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే ఇక్కడ నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంది. కూటమి ప్రభుత్వమొచ్చాక తమ అగచాట్లు వర్ణనాతీతమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు.


