గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై తీవ్రమైన దుష్ప్రచారం చేసిన కూటమి పార్టీల నేతలు.. అధికారంలోకి వచ్చాక భూముల రీసర్వేను అత్యంత వివాదాస్పదంగా మార్చేసింది. సర్వే నంబర్ల వారీగా ముందుగా సర్వే చేయడం లేదు. అక్షాంశాలు, రేఖాంశాలతో కచ్చితత్వ సర్వేకు తిలోదకాలిచ్చింది. రైతులకు తమ భూములకు సంబంధించి ఉన్న పత్రాలకు, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూమికి, ఫీల్డ్లో వాస్తవ భూమికి తేడాలు ఉన్నా.. పట్టించుకోవడం లేదు. ఎవరి సాగులో ఎంత భూమి ఉంటే అంతే భూమికి హక్కులు కల్పిస్తామని చెబుతోంది. మీకేమైనా ఇబ్బందులు ఉంటే.. కోర్టుకెళ్లండంటూ భూ తకరారులకు ఆజ్యం పోస్తోంది. ప్రభుత్వ శివాయి భూములు, పొరంబోకు, చెరువు పొరంబోకులతోపాటు సీలింగ్ భూములు సైతం ఆక్రమణదారుల కబ్జాల్లో ఉన్నా.. వారి హక్కు పత్రాలతో సంబంధం లేకుండా.. వారి సాగు అనుభవంలో ఉన్న మొత్తానికి హక్కులు కల్పిస్తూ సరికొత్త వివాదాలను సృష్టిస్తోంది.


