నెల్లూరు సిటీ: ఆ ఇంట్లో బాలుడు చేసే సందడి అంతాఇంతా కాదు. రోజు గడిస్తే పుట్టినరోజు సంబరాలు మొదలవుతాయి. అయితే విధి చిన్నచూపు చూసింది. అనుకోని ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ పరిధిలోని కొత్త వెల్లంటి గ్రామానికి చెందిన అనంత్రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గురువారం నానమ్మ తన మనుమరాలిని స్కూల్ వ్యాన్ ఎక్కించేందుకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో మనుమడు ఆయాన్ష్ (2) అక్కడికి వచ్చాడు. ఎవరూ గమనించకపోవడంతో వాహనం వెళ్లే సమయంలో బాలుడికి తగలడంతో తలకు తీవ్రగాయమైంది. హాస్పిటల్కు తరలించేలోపు మృతిచెందాడు. రూరల్ పోలీసులు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్పి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు మూడో పుట్టినరోజు
శుక్రవారం ఆయాన్ష్ మూడో పుట్టినరోజు. కుటుంబ సభ్యులు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పటి వరకు కళ్లముందు ఆటలాడిన పిల్లాడు అనంతలోకాలకు చేరుకోవడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
చెత్త గోదాములో అగ్నిప్రమాదం
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్యాస్ గోదాము సమీపంలో ఉన్న చెత్త గోదాములో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అందులోని వస్తువులు కాలిపోయాయి. పక్కనే ఉన్న గ్యాస్ గోదాములో సిలిండర్లు ఉండటంతో అంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. దీంతో గ్యాస్ గోదాము సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఎదురెదురుగా
ఢీకొన్న బైక్లు
● ఇద్దరికి తీవ్రగాయాలు
చిల్లకూరు: జాతీయ రహదారిపై రెండు మోటార్బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన గురువారం రాత్రి నారాయణ ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చే మార్గంలో చోటు చేసుకుంది. గూడూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. కలువాయి మండలం పర్ల కొండ ప్రాంతానికి చెందిన నారాయణ, మహేష్ అనే ఇద్దరు బైక్పై పోటుపాళెం వైపు నుంచి గూడూరు మినీబైపాస్ వరకు వస్తున్నారు. ఎదురుగా చిల్లకూరు మండలంలోని వేళ్లపాళెం పంచాయతీలో కాకువారిపాళెం గ్రామానికి చెందిన చందు అనే యువకుడు బైక్పై వస్తున్నాడు. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో చందు, నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేశారు.
అమ్మమ్మ
మందలించిందని..
● యువకుడి బలవన్మరణం
సైదాపురం: అమ్మమ్మ మందలించిందనే కారణంతో ఓ యువకుడు మైనింగ్ గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన మండలంలోని గిద్దలూరు పంచాయతీ పరిధిలో ఇసుకపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని తెలుగుగంగ కాలువ ప్రాంతానికి చెందిన యామిని కృష్ణ (23) అమ్మమ్మను చూసేందుకు రెండు రోజుల క్రితం ఇసుకపల్లి గ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఏం జరిగింది గానీ కృష్ణను అమ్మమ్మ మందించిందనే కారణంగా సమీపంలోని మైనింగ్ గుంతలో దూకేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడా కృష్ణ అప్పటికే చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేశారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.125
సన్నవి : రూ.60
పండ్లు : రూ.30


