నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 9వ తేదీన జరిగే ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకాశి పిలుపునిచ్చారు. నెల్లూరు సంతపేటలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలన్నారు. 2026 పీఆర్సీ ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మి కుల సమస్యలపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లు గొప్పలు చెప్పుకొంటూ కాలాయాపన చేస్తున్నారే గానీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు కొమ్మి నారాయణ, యామాల మధు, సుధాకర్, కుమార్, ఉమ, శిరీష, బద్రి, మహీంద్ర, పెంచలయ్య, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.


