● నెల్లూరులో ర్యాలీ
నెల్లూరు(టౌన్): యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని అఖిల భారత విద్యార్థి బ్లాక్ జాతీయ కమిటీ సభ్యుడు వీవీఎస్ చైతన్య, రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. జీఓ నంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదన్నారు. సంక్షేమ హాస్టళ్లల్లో విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. నిరుద్యోగ భృతి బూటకపు హామీగా మిగిలిందన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖరరెడ్డి, పోతులయ్య, వంశీ, మణి, సాయికృష్ణ, గౌతమ్, ఇంతియాజ్, పవన్ పాల్గొన్నారు.


