● కలెక్టర్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● వినతులు స్వీకరించిన అధికారులు
నెల్లూరురూరల్: నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది వ్యయప్రయాసలకోర్చి కార్యాలయానికి వచ్చారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, వివిధ శాఖల అధికారులు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు ఆయాశా ఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు.
క్రమబద్ధీకరించాలంటూ..
తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతో కూడిన సెలవులు మంజూరు చేసి వారి కుటుంబాలకు హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
నిబంధనలకు విరుద్ధంగా..
కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి షేక్ షారుక్ వినతిపత్రం అందజేశారు.
రక్షణ కల్పించాలంటూ..
స్వర్ణముఖి నది నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్న బీజేపీ నేత మిడతల రమేష్కు రక్షణ కల్పించాలని నాయకులు కోరారు. వారు మాట్లాడుతూ నది నుంచి వందలాది ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్కు కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. రమేష్పై ఇసుక అక్రమ రవాణాదారులు సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కె.రాజేశ్వరి, నరాల సుబ్బారెడ్డి, సాంబశివారెడ్డి, రఘురామయ్య, యనమల నాగేశ్వరరావు, సుజన, ఆదినారాయణ పాల్గొన్నారు.


