నెల్లూరురూరల్: దళితవాడల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజాసంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేసీ మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ జిల్లాలో ‘సామాజిక శంఖారావం’ అధ్యయన యాత్రలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. దళితులకు దేవాలయ ప్రవేశం లేకపోవడం, శ్మశానవాటికల సమస్య, ఇళ్లు, ఇళ్ల స్థలాల కొరత, సొంత భూమి లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, కాలువల్లో పూడిక తొలగించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు మాట్లాడుతూ దళిత కాలనీల అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేయడం లేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మూలం రమే ష్, మాదాల వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ వెంకటరాజు, అన్వర్, పి.మస్తానయ్య, పెద్దబ్బయ్య, బెల్లంకొండ నాగమ్మ, తాళ్లూరు మాల్యాద్రి, గోగుల శ్రీనివాసులు, కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


