తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తలు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,668 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 32,975 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
ఆర్ఐఈ నిర్మాణ
పనుల పరిశీలన
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్ వద్ద జరుగుతున్న రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ) భవన నిర్మాణ పనులను మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం పరిశీలించారు. పనుల వివరాలపై అధికారులను ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2016లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తానున్న సమయంలో అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్తో కలిసి సంస్థ నిర్మాణానికి పునాది రాయిని వేశామని వివరించారు. వివిధ కారణాలతో ఎంతో కాలంగా ఆగిన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది పూర్తయితే బీఎస్సీ, బీఏ, బీఈడీ, ఎంఈడీ, పీహెచ్డీ వంటి ఉపాధ్యాయ విద్య కోర్సులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విద్యపై పరిశోధనలు చేయడం, ఉపాధ్యాయులు, విద్యాబోధకుల నైపుణ్యాలను పెంచడం.. ప్రభుత్వ పథకాలైన ఆరెమ్మెస్ఏ, ఐసీటీ వంటి వాటిని పాఠశాలల్లో మరింత సమర్థంగా అమలు చేసేందుకు సాయపడుతుందని పేర్కొన్నారు.
సర్ ప్రత్యేక శిబిరాలు నేడు
నెల్లూరు(అర్బన్): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సర్ గణన ఫారాలను డిజిటలైజ్ చేసేందుకు గానూ ప్రత్యేక శిబిరాలను ఆదివారం ఏర్పాటు చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఓటరు తమ ఫారాన్ని పూర్తి చేసి బీఎల్వోకు అందజేయాలని కోరారు.
● జిల్లాలో 19,74,240 మంది ఓటర్లకు గానూ 19,31,907 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి 97.86 శాతం మేర ప్రగతిని సాధించామని తెలిపారు. 8,58,138 ఫారాలను డిజిటలైజ్ చేసి, 43.47 శాతం టార్గెట్ను రీచ్ అయ్యామని చెప్పారు.


