● పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్
నెల్లూరు (లీగల్): జూలై 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసులను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుని సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి.శ్రీనివాస్ కోరారు. జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం కోసం వివిధ శాఖల అధికారులతో శనివారం జిల్లా కోర్టు హాలులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజీపడదగిన కేసుల నిమిత్తం మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల ను పరిష్కరించుకోవడానికి మంచి అవకాశమని తెలిపారు. ఈ సమావేశంలో కండలేరు జలాశయం భూ సేకరణ వివాదాల పరిహారం, తెలుగు గంగ ప్రాజెక్ట్ కేసులు, మార్కెట్ విలువ, పునరావాస తదితర విషయాలపై అధికారులతో చర్చ జరిగింది. కార్యక్రమంలో తెలుగు గంగ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, అడిషనల్ ఎస్పీ సౌజన్య, మున్సిపల్ కమిషనర్ నందన్, రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్టీసీ, ఇన్సూరెన్స్, బ్యాంకు అధికారులు, వివిధ కోర్టుల న్యాయమూర్తులతో పాటు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది చుండూరి శ్రీహరి నారాయణ పాల్గొన్నారు.


