నెల్లూరు(అర్బన్): స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం సీతారామరాజు చేసిన త్యాగం, చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయమన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాధ్యాయమన్నారు. ఆయన దేశభక్తి, విలువలు, సేవాగుణం, పోరాట స్ఫూర్తితో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ పవన్తేజ, డీఆర్వో విజయకుమార్, సమాచార శాఖ డీడీ వేణుగోపాల్రెడ్డి, సెట్నల్ ఇన్చార్జి సీఈఓ శ్రీధర్బాబు, మేనేజర్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొని సీతారామరాజుకు నివాళులర్పించారు.


