● డీఈఓ ఆర్.బాలాజీరావు
నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే విధంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.బాలాజీరావు తెలిపారు. శనివారం స్థానిక దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 174 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు రెగ్యులర్ 27,910 మంది, ప్రైవేట్ 679 కలిపి మొత్తం 28,589 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 24 మంది కస్టోడియన్స్, సిటింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 174 మంది చీప్ సూపరింటెండెంట్లు, 174 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 1,532 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. జిల్లాలో 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు ఉంటుందన్నారు. పరీక్షల్లో విద్యార్థుల సమస్యలు, ఇబ్బందుల పరిష్కారం కోసం స్థానిక దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. సమస్యలపై 8341408109 నంబర్కు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లను బీఎస్ఈ (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) వెబ్సైట్ నుంచి హాల్టికెట్ ఆప్షన్కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్ టికెట్పై సంబంధిత హెడ్మాస్టరు సంతకం అవసరం లేదన్నారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్తో నేరుగా పరీక్షకు హాజరు కావచ్చన్నారు.
రేపటి నుంచి పది ఓపెన్ స్కూల్ పరీక్షలు
నెల్లూరు (టౌన్) : ఏపీ ఓపెన్ స్కూ ల్ పదో తరగతి పరీక్షలు సోమవా రం నుంచి ఈ నెల 28వ తేదీ వర కు నిర్వహించనున్నారు. జిల్లా వ్యా ప్తంగా 15 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 1291 మంది అభ్యాసకులు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 61 మంది ఇన్విజిలేటర్లు, 15 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 15 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు.


