కొమ్ము కాసే అధికారుల కొమ్ములు విరుస్తాం | - | Sakshi
Sakshi News home page

కొమ్ము కాసే అధికారుల కొమ్ములు విరుస్తాం

Feb 24 2026 6:59 AM | Updated on Feb 24 2026 6:59 AM

కొమ్మ

కొమ్ము కాసే అధికారుల కొమ్ములు విరుస్తాం

జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్దపీట

అధికారం అండతో

అధికారుల అరాచకాలు

కోటి సంతకాల సేకరణలో

ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేశారు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి

కావలి: అధికారం ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కాదని, ప్రభుత్వ శాఖల అధికారులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేయాలని, అధికార పక్షానికి కొమ్ము కాసే అధికారుల కొమ్ములు విరుస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ అధికారిని వదిలిపెట్టబోమన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, బాధితులపైనే కేసులు పెడుతున్నారన్నారు. వీరిని గుర్తు పెట్టుకుని దేశంలో ఎక్కడున్నా తగిన గుణపాఠం చెబుతామన్నారు. అధికారులు ఇప్పటికై నా నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పదని హెచ్చరించారు. జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామని, కార్యకర్తల వెంటే నాయకులు ఉంటారన్నారు. వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని పట్టణంలోని ఆర్‌ఎస్సార్‌ కల్యాణ మండంలో సోమ వారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకాణి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, లేనప్పుడు పార్టీ మారే అవకాశవాదులకు ఈసారి చోటు ఉండదన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి మాత్రమే అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం ఉంటుందన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తల అనుమతితోనే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటామన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిందే చేస్తారు.. చేసేదే చెబుతారు తప్ప చంద్రబాబులా అబద్ధాలు చెప్పి అధికారం చేజిక్కించుకునే మనస్తత్వం కాదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించి ప్రజలను పక్కదారి పట్టించేందుకు తిరుపతి లడ్డూ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతిశారన్నారు. హిందువుల గోస చంద్రబాబుకు తప్పక తగులుతుందన్నారు. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా స్థానికంగా లేకపోయినా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు సైనికులై కోటి సంతకాల సేకరణను విజయవంతంగా పూర్తి చేశారని అభినందించారు. ప్రతాప్‌రెడ్డి వచ్చారు మన పని అయిపోయిందని అనుకోకుండా అదే స్ఫూర్తితో 2029లో జరిగే ఎన్నికల వరకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అరాచకాలు, దురాగతాలకు చెల్లుచీటి

సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తమకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయన్నారు. వైఎస్సార్‌ కుటుంబం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని మాట మీద నిలబడుతుందే తప్ప మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చే వారు కాదన్నారు. గతంలో ఒక హామీ గురించి జగన్‌ వద్ద ప్రస్తావించి మేనిఫెస్టోలో పెడుదామంటే మనం గెలవకపోయినా పర్వాలేదు, అమలు చేయడం సాధ్యం కాని హామీ ఇవ్వలేనని చెప్పారన్నారు. ఇప్పటికే అధికార పార్టీ చేసిన అరాచకాలు, దురాగతాలు ప్రజలకు పూర్తిగా అర్ధమై ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అందువల్ల ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ రోజు నుంచే కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేయాలన్నారు. పార్లమెంటరీ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే ప్రజలు చంద్రబాబు మనస్తత్వం మారలేదని తెలుసుకున్నారన్నారు. విధిలేని పరిస్థితిలో మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం..

మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో తెలిసీతెలియక కొన్ని పొరపాట్లు జరిగాయని, రానున్న రోజుల్లో అటు వంటివి ఇకపై జరగవని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తనతో పాటు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి అండగా ఉండి కాపాడుకుంటామన్నారు. ఇక నుంచి అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడమే కాకుండా జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందిస్తారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పని.. మడమతిప్పని నాయకుడన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఉంటే మరోసారి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వారని, అటువంటి వ్యక్తి కాదన్నారు. ఇక నుంచి ప్రతి నాయకుడు, కార్యకర్త ఒక సైనికుడిలా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

కొమ్ము కాసే అధికారుల కొమ్ములు విరుస్తాం 1
1/2

కొమ్ము కాసే అధికారుల కొమ్ములు విరుస్తాం

కొమ్ము కాసే అధికారుల కొమ్ములు విరుస్తాం 2
2/2

కొమ్ము కాసే అధికారుల కొమ్ములు విరుస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement