పశువధ.. పట్టదా
జిల్లాలో..
జిల్లాలో పశువులు, వాటి మాంసం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సంతల ముసుగులో గుట్టుగా వేలాది ఆవులు, గేదెలను కబేళాలకు తరలించేస్తున్నారు. జిల్లా సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. వాటి మాంసం వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ మూగజీవులతో చీకటి వ్యాపారం చేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. నిరోధించాల్సిన పలు ప్రభుత్వ శాఖల
అధికారులు ముడుపుల మత్తులో మిన్నకుంటున్నారు. నాడు అమ్మలా పాలిచ్చిన పశువు నేడు మార్కెట్లో బలిపశువు అవుతోంది.
జిల్లాలో మొత్తం ఆవులు 57 వేలు, ఎద్దులు, గేదెలు(బర్రెలు) 6.57 లక్షలు, గొర్రెలు 10.20 లక్షలు, మేకలు 3.6 లక్షల వరకు ఉన్నాయి. ఇక పందులు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఏటా 10 శాతం వరకు వట్టిపోతాయి. మరికొన్ని అనారోగ్యం పాలవుతాయి. వీటిని కొందరు వ్యాపారులు రాజకీయ అండతో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వారానికి ఒకసారి జరిగే సంత ముసుగులోనే కొందరు వ్యవహారం నడిపిస్తున్నారు. దళారుల సహకారంతో పశువులను చైన్నె ప్రాంతానికి గుట్టుగా రవాణా చేస్తున్నారు.
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరంలో సంతల పేరిట మూగజీవాల చీకటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా నెల్లూరు నుంచి గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ మీదుగా చైన్నె, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. అక్కడ మాంసం ప్యాకింగ్ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా పశువులనే కాకుండా ఏకంగా వాటిని వధించి వాటి మాంసాన్ని కంటైనర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నారు.
నగరంలో ఇలా..
నగరంలోని బోడిగాడితోట ప్రాంతంలో పశువుల మాంసాన్ని చైన్నె, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ బోడిగాడి తోట ప్రాంతంలో కొందరు వ్యక్తులు పశువులను కోసి ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే వాటి మాంసాన్ని ఇతర ప్రాంతానికి రవాణా చేయడం.. అనుకూలంగా లేనిపక్షంలో పశుమాంసాన్ని కూలింగ్ బాక్సుల్లో నిల్వ ఉంచి ఆ తరువాత వాటిని రహస్యంగా తరలించడం జరుగుతోంది. పశువుల వ్యర్థాలు, వాటి కళేబరాలను అక్కడి ప్రాంతంలో వదిలేయడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వాటి ద్వారా వెదజల్లే దుర్వాసనకు అక్కడి శ్మశానానికి అంత్యక్రియలకు వచ్చేవారంతా భరించలేక ముక్కులు మూసుకుంటూ తీవ్ర అసౌకర్యానికి గురవుతన్నారు.
సంతలో సడేమియా..
నెల్లూరులోని పలు సంతల నుంచి తక్కువ రేటుకు పశువులను కొని ఇలా వాహనాల్లో ఎక్కించి చైన్నెకి తరలిస్తున్నారు. ఒక్కో వాహనంలో దాదాపు 20 వరకు పశువులను అడ్డదిడ్డంగా ఎక్కిస్తారు. అంతేకాకుండా నగరంలోని బోగిగాడితోట ప్రాంతం నుంచి వారంలో రెండు మూడు సార్లు రాత్రివేళ్లలో జంతు మాంసాన్ని చైన్నెకు అక్రమంగా తరలిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఇది జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి అధికారులకు ముడుపులిచ్చి వీటిని తరలిస్తున్నారు. చెక్పోస్టుల్లో సైతం తనిఖీలు చేయకుండా అధికారులకు ముడుపులు ముట్టజెబుతున్నారు.
నేరమని తెలిసినా..
1960 జంతు పరిరక్షణ చట్టం ప్రకారం పశువులను వధించడం చట్టరీత్యా నేరం. అయినా చీకటి వ్యాపారం జోరుగా సాగుతోంది. వట్టిపోయిన పశువులను రైతుల నుంచి రూ.5–10 వేల మధ్య దళారులు కొనుగోలు చేస్తున్నారు. వారు మాత్రం రూ.15–20 వేల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పశువుల మాంసమే కాకుండా వాటి చర్మం, కొమ్ములు, ఎముకులు ఇలా అన్ని ఉపయోగపడుతాయి. చెప్పులు, వాయిధ్య పరికరాలు, ఎరువుల తయారీలో వినియోగిస్తారు. దీంతో భారీ డిమాండ్ ఉంది.
చోద్యం చూస్తున్నారు
ఇలాంటి విక్రయాలు, రవాణా జరగకుండా చూడాల్సిన పశుసంవర్థక, పోలీస్, మార్కెటింగ్ శాఖలు చోద్యం చూస్తున్నాయి. సంతలో విక్రయాలు జరుగుతున్నా.. మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోరు. యథేచ్ఛగా రవాణా చేస్తున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులున్నా ముడుపులిచ్చి కథ నడిపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు పశువులు, వాటి మాంసం అక్రమ రవాణా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సంతల పేరిట
చీకటి వ్యాపారం
యథేచ్ఛగా పశువులు, ఆవుల
అక్రమ రవాణా
కొన్నిచోట్ల వాటిని వధించి మాంసం తరలింపు
సరిహద్దులు దాటించి
విదేశాలకు ఎగుమతి


