
తుక్కు ఫోన్లు.. చెత్త యాప్లు
ఉదయగిరి: జిల్లా వ్యాప్తంగా 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 2,934 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో 1,24,680 మంది పిల్లలు, బాలింతలు 13,098, గర్భిణులు 11,663 మంది ఉన్నారు. వీరికి అన్నీ సేవలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న పనిభారంతో సతమవుతున్న కార్యకర్తలకు అదనపు యూప్లు పేరుతో మరింత భారం పెంచారు. దీంతో కార్యకర్తలు మరింత మానసిక ఆవేదన చెందుతున్నారు.
కొత్త యాప్లకు సపోర్టు చేయని సెల్ఫోన్లు
అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం పంపిణీలో పారదర్శకత కోసం గత ప్రభుత్వం అందజేసిన 2జీ ఫోన్ల ద్వారా నమోదు చేయించింది. అప్పటి విధులకు ఆ ఫోన్లు పని చేశాయి. కానీ కూటమి ప్రభుత్వం కొత్త ఫోన్లు ఇవ్వకుండా 5జీ సపోర్టు యూప్లతో అప్లోడ్ చేయాలని చెబుతున్నారు. అసలే అరకొర సిగ్నల్స్, పనిచేయని యూప్లతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో విసుగు చెందిన కార్యకర్తలు కొత్త ఫోన్లు అయినా ఇవ్వండి లేదా కొత్త యూప్లు రద్దు అయినా చేసి పాత యూప్లు కొనసాగించండంటూ పలువురు కార్యకర్తలు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. జిల్లాలో ఒక్క ఉదయగిరి తప్ప అన్ని ప్రాజెక్ట్ల్లోని పనిచేసే కార్యకర్తలు తమకిచ్చిన సెల్ ఫోన్లను ప్రాజెక్ట్ కేంద్రాల్లో ఇచ్చారు.
రేషన్ పంపిణీలో ఇబ్బందులు
కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చి విధానంలో లబ్ధిదారులకు సరుకులు ఇవ్వాలంటే యూప్లో ముఖ ఆధారిత గుర్తింపు తప్పని సరి. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తల వద్ద ఉన్న పాత ఫోన్లు సపోర్టు చేయకపోవడంతో ఫేస్ క్యాప్చర్ కావడం లేదు. దీంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు రేషన్ ఇవ్వడంలో ఇబ్బంది తలెత్తుతోంది. గతంలో కుటుంబంలో ఎవరూ వచ్చిన ఆహారం ఇచ్చే అవకాశం ఉండేది. కానీ కొత్త యూప్లో ఆ అవకాశం లేదు. దీంతో కార్యకర్తలు లబ్ధిదారులకు, అధికారులకు సమాధానం చెప్పలేక మానసిక ఆందోళనకు గురువుతున్నారు. పైగా యూప్లతోనే కుస్తీ పట్టాల్సిన రావడంతో పిల్లలపై దృష్టి పెట్టేందుకు సమయం సరిపోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాలలు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యానికి, పోషకాహారానికి భరోసాగా నిలుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం కుంపటిగా మారింది. పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, పిల్లలకు క్రమశిక్షణ, ఆట పాటలతో కూడిన విద్యను అందించడంతోపాటు కిశోర బాలికల వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ సిబ్బందిపై పనిభారం పెరగడంపై అష్టకష్టాలు పడుతున్నారు. పని భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి కొత్త యాప్లు తీసుకొచ్చి ఒత్తిడి మరింత పెంచింది. తుక్కు ఫోన్లు, చెత్త యాప్లతో విసిగిపోయిన వర్కర్లు ప్రభుత్వం తమికిచ్చిన సెల్ఫోన్లను ఆయా ప్రాజెక్ట్ కేంద్రాల్లో జమ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
ముఖ ఆధారిత గుర్తింపుతో రేషన్ పంపిణీ
సపోర్టు చేయకపోవడంతో
నమోదు కాని పరిస్థితి
పని భారం.. అధికారుల ఒత్తిళ్లు
విసిగిపోయిన అంగన్వాడీలు
ఐసీడీఎస్ కార్యాలయల్లో ఫోన్ల అప్పుగింత
మానసిక వేదనతో
సతమవుతున్న కార్యకర్తలు
ఫేస్ క్యాప్చర్ తీసివేయాలి
ముఖ ఆధారిత గుర్తింపు విధానం (ఫేస్ క్యాప్చర్) తీసి వేయాలి. ఈ విధానంలో లబ్ధిదారులు కచ్చితంగా కేంద్రం వద్దకే రావాలి. వారి ఫోన్లకు వచ్చే ఓటీపీ చెప్పాలంటే భయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫోన్లు కొత్త యాప్లకు సపోర్టు చేయడం లేదు. సిగ్నల్స్ లేకపోవడంతో ఒక్కరికే గంటల తరబడి సమయం కేటాయించాలి వస్తుంది. మాన్యువల్ విధానమే కొనసాగించాలి.
– శ్రీదేవి, అంగన్వాడీ యూనియన్ లీడర్
అధికారుల వేధింపులు ఆపాలి
పని చేయని ఫోన్లు ఇచ్చి కార్యకర్తలపై అధికారులు ఒత్తిడి తెచ్చి వేధింపులకు గురి చేయడం మానుకోవాలి. కొత్త యాప్లు ప్రవేశపెట్టి అంతే స్పీడ్తో పాత ఫోన్లు ఎలా పని చేస్తాయనేది అధికారులకు తెలియదా?. అంగన్వాడీ కార్యకర్తలు చేసే పనులకు, వారికి ఇచ్చే వేతనం చూస్తే ప్రభుత్వం వారితో వెట్టి చాకిరి చేయిస్తోంది. ప్రభుత్వం పని తగ్గ వేతనం అమలు చేసి వారితో పనులు చేయించాలి.
– కాకు వెంకటయ్య

తుక్కు ఫోన్లు.. చెత్త యాప్లు

తుక్కు ఫోన్లు.. చెత్త యాప్లు