రెండో వన్డేలోనూ విండీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. సిరీస్‌ కైవసం | Womens Cricket: Sri Lanka Beat West Indies By 5 Wickets In Second ODI, Clinched The Series | Sakshi
Sakshi News home page

SL-W Vs WI-W: రెండో వన్డేలోనూ విండీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. సిరీస్‌ కైవసం

Jun 18 2024 2:46 PM | Updated on Jun 18 2024 4:46 PM

Womens Cricket: Sri Lanka Beat West Indies By 5 Wickets In Second ODI, Clinched The Series

మహిళల ఐసీసీ వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక మరో మ్యాచ్‌ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న వెస్టిండీస్‌ మహిళల జట్టు ఇవాళ (జూన్‌ 18) రెండో వన్డే ఆడింది. ఈ మ్యాచ్‌లో అతిథ్య శ్రీలంక.. పర్యాటక జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా శ్రీలంకనే విజయం సాధించింది.

గాలే వేదికగా జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌...లంక బౌలర్ల ధాటికి 31 ఓవర్లలోనే 92 పరుగులకే చాపచుట్టేసింది. కవిష దిల్హరి (6-0-20-4), చమారీ ఆటపట్టు (2-0-8-0), అచిని కులసూరియా (7-1-6-2), సుగందిక కుమారీ (6-0-16-1) విండీస్‌ పతనాన్ని శాశించారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో రషాదా విలియమ్స్‌ (24), చెడీన్‌ నేషన్‌ (12), ఆలియా అలెన్‌ (16), అఫీ ఫ్లెచర్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్‌ విష్మి గుణరత్నే (50) అర్దసెంచరీతో రాణించడంతో 21.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక ఇన్నింగ్స్‌లో విష్మితో పాటు కవిష దిల్హరి (28) రాణించింది. విండీస్‌ బౌలర్లలో కరిష్మ రామ్హరాక్‌ 2, షమీలియా కానెల్‌, ఆలియ అలెన్‌, జైదా జేమ్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ సిరీస్‌లో జరగాల్సిన చివరి వన్డే జూన్‌ 21 ఇదే వేదికగా జరుగనుంది. వన్డే సిరీస్‌ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. జూన్‌ 24, 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement