
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లికి ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
ఈ మ్యాచ్లో 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి కింగ్ కోహ్లి ఔటయ్యాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన విరాట్.. 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ చాలా త్వరగా అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్ ప్రకటించాడని, 2026 టీ20 ప్రపంచ కప్ వరకు ఆడింటే బాగుండేదని రైనా అభిప్రాయపడ్డాడు.
"విరాట్ కోహ్లి టీ20 క్రికెట్ నుంచి కాస్త ముందుగా రిటైర్ అయ్యాడని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. ప్రస్తుతం అతడు ఆడుతున్న తీరును చూస్తుంటే టీ20 ప్రపంచకప్-2026 కొనసాగింటే బాగుండేది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
అతడు ఇప్పటికీ చాలా ఫిట్నెస్గా కన్పిస్తున్నాడు" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్కప్-2024 విజయం అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు.
కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విరాట్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 125 మ్యాచ్లు ఆడి, 48.69 సగటుతో 4188 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు, 124 ఫోర్లు, 54 సిక్సర్లు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్లలో కోహ్లి 1292 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు