ఫైన‌ల్లో విజ‌యం.. వెక్కి వెక్కి ఏడ్చిన హార్దిక్ పాండ్యా! వీడియో వైర‌ల్‌ | Virat Kohli, Hardik Pandya in Tears After India Win T20 World Cup 2024 | Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఫైన‌ల్లో విజ‌యం.. వెక్కి వెక్కి ఏడ్చిన హార్దిక్ పాండ్యా! వీడియో వైర‌ల్‌

Jun 30 2024 9:55 AM | Updated on Jun 30 2024 1:37 PM

Virat Kohli, Hardik Pandya in Tears After India Win T20 World Cup 2024

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ఛాంపియ‌న్స్‌గా భార‌త్ అవ‌త‌రించింది. శ‌నివారం బార్బోడ‌స్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యం సాధించిన టీమిండియా.. రెండో సారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్రోఫీని ముద్దాడింది. 

ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ టైటిల్ పోరులో 7 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. ఓట‌మి త‌ప్ప‌ద‌న‌కున్న చోట భార‌త బౌల‌ర్లు అద్బుతం చేసి త‌మ జ‌ట్టును మ‌రోమారు విశ్వవిజేత‌గా నిలిపారు.

177 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ప్రోటీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 169 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. అంత‌క‌ముందు బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. కోహ్లి(76), అక్షర్ ప‌టేల్(47) ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు.

క‌న్నీళ్లు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా..
ఆఖ‌రి ఓవ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌యానికి 16 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. చివ‌రి ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను రోహిత్‌.. హార్దిక్ పాండ్యాకు అప్ప‌గించాడు. రోహిత్ న‌మ్మ‌కాన్ని పాండ్యా ఒమ్ము చేయ‌లేదు. కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి భార‌త్‌కు చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని అందించాడు.

ఆఖ‌రి బంతి ముగిసిన వెంట‌నే భార‌త ఆట‌గాళ్లు తీవ్ర బావోద్వేగానికి లోన‌య్యారు.  రోహిత్ శర్మ నేలను ముద్దాడాడు. హార్దిక్ పాండ్యా అయితే వెక్కి వెక్కి ఏడ్చాడు. పాండ్యాను ఓదార్చ‌డం ఎవ‌రి త‌రం కాలేదు. వీరిద్ద‌రితో పాటు విరాట్ కోహ్లి, సిరాజ్ సైతం క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement