ప్రపంచ క్రికెట్లో పెను సంచలనంగా మారిన 15 ఏళ్ల భారత బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. వైభవ్ తొలిసారి భారత సీనియర్ జట్టుకు ఎంపికై సరికొత్త పలు రికార్డులు నెలకొల్పాడు. త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన మూడు భారత జట్లలో ఈ బిహారి బుడ్డోడు చోటు దక్కించుకున్నాడు.
తద్వారా అత్యంత పిన్న వయస్సులో భారత సీనియర్ జట్టుకు ఎంపికైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరటి 37 ఏళ్ల పాటు ఉండిన ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.
సచిన్ 1989లో పదహారేళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ మీద అరంగేట్రం చేయగా.. వైభవ్ కేవలం పదిహేనేళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. జూన్ 26 నుంచి ఐర్లాండ్తో జరుగబోయే సిరీస్లో వైభవ్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైంది. ఈ లెక్కన పదిహేనేళ్ల 91 రోజుల వయసులో వైభవ్ టీమిండియా అరంగేట్రం చేయడం కూడా ఖరారైనట్లే.
ఈ క్రమంలో వైభవ్ మరో చారిత్రక రికార్డు నెలకొల్పడం కూడా ఖాయమైంది. అత్యంత చిన్న వయసులో టీ20 అరంగేట్రం చేయనున్న ఐసీసీ ఫుల్ మెంబర్ జట్ల సభ్యుడిగా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ పేరిట ఉంది.
ముజీబ్ 2018లో 16 ఏళ్ల 314 రోజుల వయసులో టీ20 అరంగేట్రం చేశాడు. త్వరలో (15 ఏళ్ల 91 రోజులు) వైభవ్ ముజీబ్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్గా అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన ఆటగాడి రికార్డు రొమేనియాకు చెందిన ఎం ఘెరసిమ్ పేరిట ఉంది. ఇతను 2020లో 14 ఏళ్ల 16 రోజుల వయసులో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు.


