ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు సంచలన విషయాన్ని బయటపెట్టిన కరుణ్‌ నాయర్‌ | Told Me To Retire For League Money, Karun Nair On Shocking Advice From Indian Cricketer | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు సంచలన విషయాన్ని బయటపెట్టిన కరుణ్‌ నాయర్‌

Jun 16 2025 3:04 PM | Updated on Jun 16 2025 3:25 PM

Told Me To Retire For League Money, Karun Nair On Shocking Advice From Indian Cricketer

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌ ప్రారంభానికి ముందు (జూన్‌ 20) టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. మెయిల్‌ స్పోర్ట్‌ అనే ప్రముఖ మేగజైన్‌తో మాట్లాడుతూ.. ఓ బాంబు లాంటి వార్త చెప్పాడు.

కరుణ్‌ మాటల్లో.. నాకు ఇప్పటికీ గుర్తుంది. రెండేళ్ల క్రితం టీమిండియాలో స్థానం​ కోసం​ పరితపిస్తున్న రోజులవి. ఆ సమయంలో ఓ అగ్రశ్రేణి భారత క్రికెటర్ నాకు ఫోన్ చేసి రిటైర్మెంట్‌ ప్రకటించమని సలహా ఇచ్చాడు. ప్రైవేట్‌ టీ20 లీగ్‌ల్లో చాలా డబ్బు వస్తుందని చెప్పడమే అతని ఉద్దేశం. అలా చేసి ఉండటం చాలా సులభం. కానీ నేను భారత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చే ఏ విషయంలోనూ రాజీ పడదలచుకోలేదు. ఆ రోజు నేను డబ్బు గురించి ఆలోచించి ఉంటే ఈ రోజు ఇక్కడ (ఇంగ్లండ్‌లో) ఉండే వాడిని కాదు.

టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ధృడమైన లక్ష్యంతో ఆ రోజు ఆ ప్రముఖ క్రికెటర్‌ సలహాను పెడచెవిన పెట్టిన కరుణ్‌.. రెండేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు టీమిండియాలో చోటు సాధించాడు. 2023లో కర్ణాటక నుండి విదర్భకు మారడం (దేశవాలీ క్రికెట్‌లో) కరుణ్‌ అదృష్టాన్ని మార్చేసింది.

గత రెండు దేశవాలీ సీజన్లలో 1500కు పైగా పరుగులు సాధించిన కరుణ్‌ (విదర్భ).. టీమిండియా తలుపులు తట్టాడు. గత రంజీ సీజన్‌లో అసాధారణ ప్రదర్శన (53.93 సగటున 863) కనబర్చి విదర్భ టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మధ్యలో ఇంగ్లండ్‌ కౌంట్లీలోనూ ఆడిన కరుణ్‌ అక్కడ కూడా సత్తా చాటాడు. రెండు సీజన్లలో నార్తప్టంన్‌షైర్‌ తరఫున 56.61 సగటున 736 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ కూడా ఉంది.

నాయర్‌ తాజాగా ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో కూడా డబుల్‌ సెంచరీతో సత్తా చాటాడు. విరాట్‌ కోహ్లి టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో అతని స్థానానికి కరుణ్‌ సరైన అర్హుడని కొందరు భావిస్తున్నారు. 2018లో టీమిండియా తరఫున చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన కరుణ్‌.. దాదాపు ఏడేళ్ల తర్వాత 33 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తికర పరిణామం. కరుణ్‌ తన చిన్నపాటి టెస్ట్‌ కెరీర్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. కరుణ్‌ చేసిన ఆ ట్రిపుల్‌ సెంచరీ ఇంగ్లండ్‌పైనే కావడం విశేషం.

ఇంగ్లండ్‌తో టెస్టుల‌కు భార‌త జ‌ట్టు..
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement