మరో రెండు రోజుల్లో (జూన్ 6) ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ (ముల్లాన్పూర్) కోసం టీమిండియా సర్వం సిద్దం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఓ యువ ఆటగాడు అరంగేట్రం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. యువ స్పిన్నర్లు హర్ష్ దూబే, మానవ్ సుతార్లో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చని సంకేతాలు ఇచ్చాడు. దీంతో వీరిలో ఒకరు టెస్టు క్యాప్ అందుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ముల్లాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశముండటంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, రెండో స్పిన్నర్గా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగడం దాదాపుగా ఖాయం కాగా.. మూడో స్పిన్నర్ స్థానం కోసం హర్ష్, సుతార్ మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.
పేసర్లుగా మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ పేర్లు ఖరారయ్యాయి. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీశ్ రెడ్డి బరిలోకి దిగడం కూడా ఖయంగా తెలుస్తోంది.
బ్యాటింగ్ విషయానికొస్తే.. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మేనేజ్మెంట్ ఒకవేళ మరో స్పెషలిస్ట్ బ్యాటర్తో బరిలోకి దిగాలని భావిస్తే.. నితీశ్ను పక్కన పెట్టి ధృవ్ జురెల్కు అవకాశం ఇవ్వవచ్చు.


